హైదరాబాద్, నవంబర్11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పాతాళ గంగ పైపైకి ఎగదన్నుకొస్తున్నది. ఒకప్పుడు నెర్రెలుబారిన నేలంతా నేడు నీటిగలగల సవ్వళ్లతో పులకిస్తున్నది. ప్రభుత్వ నీటి సంరక్షణ చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. 2020తో పోల్చితే సగటున భూగర్భ జలమట్టం 4.4 మీటర్లకు పెరిగింది. వర్షపాతం ఆధారంగా కాకుండా తెలంగాణ సర్కారు చేపట్టిన సంరక్షణ చర్యల ఫలితంగానే భూగర్భజలాల మట్టం గణనీయంగా పెరుగుతున్నది. ఈ విషయాన్ని సెంట్రల్ గ్రౌండ్ వాటర్బోర్డు (సీజీడబ్ల్యూబీ) నివేదిక స్పష్టంచేసింది. 2022 ఏడాదికి డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ అసెస్మెంట్ రిపోర్ట్ను సీజీడబ్ల్యూబీ ఇటీవలనే విడుదల చేసింది.
ఆ నివేదిక ప్రకారం దేశం మొత్తం వార్షిక భూగర్భజలాల రీచార్జ్ 2020తో పోల్చితే కాస్త మెరుగుపడింది. అదే సమయంలో రీచార్జి అవుతున్న భూగర్భజలాలను అదేస్థాయిలో వినియోగిస్తున్నట్టు రిపోర్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా వర్షపాతం ఆధారంగానే భూగర్భజలాలు 61శాతం రీచార్జి అవుతున్నాయని, నీటిపారుదల, చెక్డ్యామ్ల ద్వారా 39 శాతమే రీచార్జి అవుతున్నదని తెలిపింది. భూగర్భజలాల్లో సాగునీటికోసం 87 శాతం వినియోగిస్తుండగా, పరిశ్రమలు, గృహావసరాలకు 13 శాతం వినియోగిస్తున్నట్టు తెలిపింది.