Influenza | హైదరాబాద్, మార్చి11 (నమస్తే తెలంగాణ): దేశంలో హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 ఇన్ఫ్లూయెంజాతోపాటు శ్వాససంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయని, ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేశ్భూషణ్ శనివారం ప్రత్యేకంగా లేఖ రాశారు.
ఇన్ఫ్లూయెంజాతోపాటు శ్వాసకోశ సంబంధిత కేసులు అన్ని రాష్ర్టాల్లో నమోదవుతున్నాయని వివరించారు. అడినో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలను చేపట్టాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించాలని, వైద్యశాలల్లో కావాల్సిన మందులు, పరికరాలు, ఆక్సిజన్ తదితర వాటన్నింటినీ ముందస్తుగా సమకూర్చుకోవాలని పేర్కొన్నారు.