హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్తు సవరణ చట్టాన్ని అడ్డుకొనేందుకు ఇదే కీలక సమయమని నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ (ఎన్సీసీవోఈఈఈ) తెలిపింది. ఈ బిల్లును ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ అడ్డుకోలేమని పేర్కొన్నది. ఈ క్లిష్టమైన సమయంలోనే అంతా ఐక్యంగా పోరాడి ఈ బిల్లుకు చెక్ పెట్టాలని పిలుపు ఇచ్చింది. విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎన్సీసీవోఈఈఈ మంగళవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జాతీయ సదస్సు నిర్వహించింది.
పలువురు ఎంపీలు, రాజకీయ నేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు. మోదీ సర్కార్పై విద్యుత్తు ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి ఎంపీలు సంజయ్సింగ్ (ఆమ్ ఆద్మీ పార్టీ), సీపీఎం నేతలు ఈ కరీం, బినోయ్ బిశ్వాస్, సీనియర్ కార్మిక నేత తపన్సేన్, యునైటెడ్ కిసాన్ మోర్చా నేత హన్నన్ మొల్లాతోపాటు ఏఐటీయూసీ, సీఐటీయూ, ఎన్ఐటీయూసీ, హెచ్ఎంఎస్ తదితర కార్మిక సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. పార్లమెంట్లో విద్యుత్తు బిల్లును ప్రవేశపెట్టేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తే సమ్మెకు దిగాలని విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లు నిర్ణయించారు. ఆగస్టు 10న అన్ని జిల్లాల్లో నిరనసలు తెలుపుతామని ప్రకటించారు. సదస్సులో ఎన్సీసీవోఈఈఈ ప్రధాన కార్యదర్శి రత్నాకర్రావు తదితరులు పాల్గొన్నారు.