సంగారెడ్డి, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం కన్ను భూగర్భ జలాలపై పడింది. పరిశ్రమలు, అపార్ట్మెంట్లు ఉన్నచోట భూగర్భ నీటి రక్షణ పేరుతో భారీగా ఆదాయం పొందే ప్రణాళిక రచించింది. బోరు బావుల ద్వారా నీటిని తోడటంపై కఠిన ఆంక్షలు విధిస్తున్నది. ప్రస్తుతం పరిశ్రమల్లో అమలుచేస్తున్న ఈ ఆంక్షలు త్వరలోనే అపార్ట్మెంట్లు, హౌజింగ్ సొసైటీలు, వాటర్ ప్లాంట్లు, స్విమ్మింగ్పూల్స్కు వర్తింపజేయనున్నది. బోరు బావులకు డిజిటల్ వాటర్ ఫ్లో మీటర్లు అమర్చి నిర్దేశిత పరిమితికి మించి నీటిని తోడితే ప్రాంతాన్నిబట్టి అదనంగా తోడే ప్రతి లీటర్ నీటిపై రూ.1 నుంచి రూ.20 వరకు వసూలు చేయనున్నది.
రెండు లక్షల లీటర్ల వరకే ఉచితం
పరిశ్రమలు, ఇండ్లు, అపార్ట్మెంట్లలో నీటి అవసరాలు తీర్చేది భూగర్భ జలాలే. నీరు సమృద్ధిగా ఉన్నచోటే పరిశ్రమలైనా, జనావాసాలైనా అభివృద్ధి చెందుతాయి. కొన్నిచోట్ల అవసరానికి మించి భూగర్భజలాలు తోడేస్తుండటంతో నీటిమట్టం పడిపోతున్నది. దీనిని ఆసరాగా చేసుకొని కేంద్ర జల్శక్తిశాఖ పరిధిలోని సెంట్రల్ గ్రౌండ్వాటర్ ఆథారిటీ (సీజీడబ్ల్యూఏ) భారీ ప్రణాళిక రచించింది. దేశాన్ని భూగర్భనీటి మట్టం ఆధారంగా కొన్ని భాగాలుగా విభజించి, నీటిని తోడటంపై ఆంక్షల పేరుతో భారీ ఆదాయంపై కన్నేసింది. ఏ పరిశ్రమ అయినా తన అవసరాలకు రోజుకు బోర్బావులు, బావుల ద్వారా రెండు లక్షల లీటర్లకంటే ఎక్కువ నీటిని తోడరాదని ఆంక్షలు విధించింది. అంతకుమించి తోడితే ప్రతి అదనపు లీటర్కు అదనపు చార్జి (గ్రౌండ్వాటర్ అబ్స్ట్రాక్షన్ చార్జెస్) విధించాలని నిర్ణయించింది. ఈ చార్జీలు ప్రాంతాన్నిబట్టి లీటర్కు రూ.1 నుంచి రూ.20 వరకు ఉంటాయి. ఇకపై బోర్లు వేయటానికి కూడా సీజీడబ్ల్యూఏ అనుమతి తప్పనిసరి. రాష్ట్రంలో సీజీడబ్ల్యూఏ ఆదేశాలు ఇప్పటికే అమలవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో పదివరకు పరిశ్రమలు తమ బోరుబావులకు వాటర్ఫ్లో మీటర్లను అమర్చుకొన్నాయి. ఈ మీటర్లు బిగించాలని జిల్లాలో దాదాపు 300 పరిశ్రమలకు సీజీడబ్ల్యూఏ నోటీసులిచ్చింది.
చార్జీలు ఎవరిపై విధిస్తారు?
పరిశ్రమలు, తాగునీటి వాటర్ బాటిళ్ల తయారీ కంపెనీలు, మైనింగ్ కంపెనీలు, అపార్మెంట్లు, హౌజింగ్ సొసైటీలు, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ నీటిసరఫరా సంస్థలు, స్విమ్మింగ్ పూల్స్.
తప్పనిసరిగా మీటర్లు బిగించాల్సిందే
సీజీడబ్ల్యూఏ ఆదేశంతో జిల్లాలోని పరిశ్రమలు బోరుబావులకు డిజిటల్ వాటర్ ఫ్లో మీటర్లను బిగించాలని నోటీసులిచ్చాం. జిల్లాలోని అన్ని పరిశ్రమలు తప్పనిసరిగా మీటర్లు బిగించాల్సిందే. కొన్ని సంస్థలు ఇప్పటికే బిగించాయి. మిగతావి మీటర్లు బిగించేలా చర్యలు తీసుకొంటున్నాం.
– వెంకటేశ్వర్రావు, డీడీ, గ్రౌండ్వాటర్, సంగారెడ్డి జిల్లా