న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: బీమా దిగ్గజం ఎల్ఐసీ విలువను తక్కువ చేసి, వాటాల్ని కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తున్న వైనంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఏ బీమా కంపెనీకి లేనంత అగ్గువ మార్కెట్ ధరను ఎల్ఐసీ ఐపీవోకు నిర్ణయించడాన్ని ప్రతిపక్ష పార్టీలతో పాటు విశ్లేషకులు, నిపుణులు దుయ్య బట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరి కొంతమంది ఆర్థిక విశ్లేషకులు కంపెనీకున్న రియల్ ఎస్టేట్ ఆస్తుల్ని ప్రస్తావిస్తూ సంస్థకు నిర్దేశించిన విలువను, ఆఫర్ జారీకి కేంద్ర ప్రభుత్వం తొందరపడుతున్న తీరును ఎత్తి చూపుతున్నారు. దశాబ్దాలుగా ఎల్ఐసీ..రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు చేసిందని, వాటి విలువ ఆపారంగా పెరిగిందని వారంటున్నారు.
ముంబై ఫోర్ట్, ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ ప్రాంతాల్లో ఎల్ఐసీకి ఉన్న సొంత ప్రాపర్టీలు పెద్ద రియల్టర్స్కు సైతం కళ్లు చెదిరే ఆస్తులని చార్టెర్డ్ అకౌంటెంట్ మురళీ ధరన్ వివరించారు. సంస్థకున్న రియల్ ఎస్టేట్, ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్స్, ఇతర ఖజానా విలువ రూ. 44,42,075 కోట్లుగా 2020 మార్చిలో సంస్థ జరిపిన ఇంటర్నల్ అసెస్మెంట్లో తేలింది. ఇది.. ఎల్ఐసీకి ప్రభుత్వం నియమించుకున్న అడ్వయిజర్ నిర్దేశించిన ఎంబెడెడ్ విలువకు సమానం.
ఎల్ఐసీకి ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న పెట్టుబడులు తక్కువేమీ కాదు. ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లు, షేర్లలో ఉన్న పెట్టుబడుల విలువ 2021 సెప్టెంబర్నాటికి రూ. 39.5 లక్షల కోట్లు ఉన్నట్లు ఎల్ఐసీ సమర్పించిన ముసాయిదా ప్రాస్పెక్టస్లోనే వెల్లడించింది. ఇక సంస్థ చేసే బీమా వ్యాపారం, దీని దీర్ఘకాలిక అవకాశాల విలువ అపారం. ఈ విలువల్ని రూ.6 లక్షల కోట్లకు తగ్గించి, ఎలాగైనా ఎల్ఐసీ ఐపీవోను తీసుకురావడానికి ప్రభుత్వం తొందరపడుతున్న తీరుపై ఆర్థిక విశ్లేషకులు విస్తుపోతున్నారు. యుద్ధ మేఘాలు తొలగిన తర్వాత, మార్కెట్లు స్థిరపడేంతవరకూ వేచిచూడవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. తగ్గించిన విలువ, కుదించిన ఐపీవో పరిమాణంతో రూ. 21 వేల కోట్లు సమీకరించినంత మాత్రాన డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం కూడా నెరవేరదు. సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజం సౌదీ అరామ్కో 29.4 బిలియన్ డాలర్ల మెగా ఐపీవో తర్వాత ఎల్ఐసీయే క్యాపిటల్ మార్కెట్లో సంచలనం సృష్టించగలదంటూ ఏడాది క్రితం వ్యక్తమైన విశ్వాసం ఇప్పుడు ఏమైందని వారంటున్నారు. ఎల్ఐసీ షేర్లను చౌకగా చేజిక్కించుకుని, లాభాలు దండుకునే కొద్దిమంది అంతర్జాతీయ ఇన్వెస్టర్ల కోసమే ఇదంతా అన్న అనుమానాల్ని వారు వ్యక్తం చేస్తున్నారు.