PDS | హైదరాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పేదలకు బియ్యం అందించే రేషన్ దుకాణాలపైనా పడింది. ఇందులోకి ప్రైవేటును చొప్పించేందుకు కుట్రలు చేస్తున్నది. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీశాఖ శుక్రవారం ఢిల్లీలో పలు పైవేటు సంస్థలతో సమావేశమైంది. స్విగ్గీ, జొమాటో, డీల్షేర్, బిగ్బాస్కెట్ సహా పలు సంస్థలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. చౌకధరల దుకాణాల్లో మార్పులు చేయడంలో భాగంగా ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంపై సమావేశంలో చర్చించినట్టు కేంద్రం పేర్కొంది. సమావేశానికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేస్తూ వివరాలను వెల్లడించింది. చౌకధరల దుకాణాల్లో మార్పులు చేయడంలో భాగంగానే ఈ సమావేశం నిర్వహించామని, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా ఏర్పడే అవకాశాలు, సమస్యలపై చర్చించినట్లు వివరించింది. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చితే రాష్ట్రంలోని 17,227 రేషన్ షాపుల పరిస్థితేంటనేది ప్రశ్నార్థకంగా మారింది. అవి రద్దయితే వీటిపైనే ఆధారపడి జీవిస్తున్న రేషన్ డీలర్ల పరిస్థితిపైనా ఆయోమయం నెలకొంది. అంతేకాదు, రేషన్ షాపులు మూతపడితే పంపిణీ సంగతేంటన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రం అనుకుంటున్నట్టుగా రేషన్ వ్యవస్థ ప్రైవేటు చేతుల్లోకి వెళ్తే పేదలపై ఆర్థిక భారం తప్పదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది.
పేదల ఆకలి తీరుస్తున్న కేసీఆర్ ప్రభుత్వం
ఆహార సబ్సిడీ నిధుల కేటాయింపులో కోత పెట్టిన కేంద్రం కొన్ని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రేషన్ బియ్యానికి బదులుగా నగదును పంపిణీ చేస్తున్నది. తెలంగాణ పభుత్వం మాత్రం ఇటీవల రేషన్ డీలర్లకు క్వింటాలుకు గతంలో రూ. 90గా ఉన్న కమీషన్ను రూ. 140కి పెంచింది. గతేడాది సుమారు 3 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికీ రేషన్ అందిస్తున్నది. ఒక లబ్ధిదారుడికి కేంద్రం 5 కేజీలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 6 కేజీలు ఇస్తూ పేదల ఆకలి తీరుస్తూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.