హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): వైద్యవిద్యా విధానంపై కేంద్ర ప్రభుత్వం తన ఇష్టమొచ్చినట్టు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నది. వాటిపై రాష్ర్టాల ప్రభుత్వాలతోపాటు వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురయ్యాక వెనక్కి తగ్గుతున్నది. ఈ నిర్లక్ష్య వైఖరితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు నీట్ను ప్రవేశపెట్ట డం మొదలుకొని ఇటీవలి నీట్ కామన్ కౌన్సెలింగ్, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్) వరకు అనేక ఉదాహరణలు ఉన్నాయి.
గతంలో మెడికల్ సీట్లకు రాష్ర్టాలే ఎంసెట్ తరహా ప్రవేశ పరీక్షలు నిర్వహించేవి. ఆ తర్వాత దాని స్థానంలో కేంద్రం ‘నీట్’ను తీసుకొచ్చింది. దీంతో సిలబస్ మారివిద్యార్థులు అనేక అవస్థలు పడ్డారు.
ఈ ఏడాది మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ‘కామన్ కౌన్సెలింగ్’ నిర్వహిస్తామంటూ కేంద్రం గత నెలలో గెజిట్ కూడా విడుదల చేసింది. ప్రస్తుతం మెడికల్ కాలేజీల్లోని 15% ఆలిండియా కోటా సీట్లకు కేంద్రం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నది. మిగతా 85% సీట్లకు రాష్ర్టాల మెడికల్ యూనివర్సిటీలు కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి. రాష్ట్రంలో ఈ కౌన్సెలింగ్ కాళోజీ నారాయణరావు వర్సిటీ ద్వారా జరుగుతుంది. అయితే కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ సహా అనేక రాష్ర్టాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
అయితే రాష్ర్టాల కౌన్సెలింగ్తో ప్రైవేట్ కాలేజీల్లో సీట్లను బ్లాక్ చేస్తూ అధిక ధరలకు అమ్ముకుంటున్నారని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) వాదిస్తున్నది. పైగా కోర్టు మార్గదర్శకాల మేరకే ఈ విధానాన్ని తెస్తున్నామంటూ కేంద్ర వైద్యారోగ్య శాఖకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) చెప్తున్నది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఘాటుగా స్పందిస్తూ లేఖ రాసింది. కామన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని, కన్వీనర్ కోటాలోని సీట్లను బ్లాక్ చేసే అవకాశమే లేదని స్పష్టం చేసింది. ఇదే విషయమై తమిళనాడు లాంటి అనేక రాష్ర్టాలు సైతం కేంద్రానికి లేఖలు రాశాయి. దీంతో ఈ ఏడాది ఎప్పటి మాదిరిగానే కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది.
2019లో ఎంబీబీఎస్లో చేరిన విద్యార్థులు ఈ ఏడాది నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్స్) రాయాల్సిందేనని కేంద్రం గత నెలలో ప్రటించింది. ఏడాదికి రెండుసార్లు ఈ పరీక్ష ఉంటుందని, స్టెప్-1 పూర్తిచేస్తేనే ఇంటర్న్షిప్, పీజీ అడ్మిషన్లకు అవకాశం ఉంటుందని పేర్కొన్నది. కానీ, దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. కేంద్ర ఆరోగ్య, మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వచ్చే వరకు నెక్ట్స్ను వాయిదా వేస్తున్నట్టు ఎన్ఎంసీ గురువారం ప్రకటించింది. ఇలా వైద్యవిద్యపై కేంద్ర ప్రభుత్వం అస్తవ్యస్త, అనాలోచిత నిర్ణయాలను తీసుకోవడం వల్ల విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.