సంక్షేమం సమాధి అయిపోవాలి. సామాజిక భద్రత గాలికొదిలేయాలి. బాలలు.. వృద్ధులు.. నిరుపేదలు.. ఎవరి బాగూ పట్టదు. అధికారం మాత్రమే పరమావధి. అందుకోసం ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టి.. జైలుకూడు తినిపించి లొంగదీసుకోవాలి. ఈ టార్గెట్ను పూర్తిచేయడానికి స్వతంత్ర దర్యాప్తు సంస్థను అడ్డదిడ్డంగా వాడుకోవాలి. ఇదీ.. ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కూటనీతి. సంక్షేమ పథకాలకు నిధుల కోత పెట్టి పేదల కడుపు కొడుతున్న కేంద్రం.. కక్ష సాధింపు చర్యల కోసం ప్రయోగించే ఈడీకి మాత్రం ఏటికేడు నిధుల వరద పారిస్తున్నది. 2020-21లో రూ.265 కోట్లు కేటాయించిన మోదీ సర్కారు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రూ.357.57 కోట్ల నిధుల వరద పారించింది. టార్గెట్లు పెట్టి మరీ.. ఈడీని ఉసికొల్పుతున్నది. ఇదే సమయంలో పేదల సంక్షేమం మాత్రం గాల్లో కలిసిపోయింది.
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. తల్లులు, పసిపిల్లలు, వృద్ధులు, నిరుపేదలు.. ఇలా ఎవరినీ వదలకుండా అన్ని రకాల సంక్షేమ పథకాల్లో అడ్డగోలుగా కోతలు విధిస్తున్నది. కేటాయించిన కొద్దిపాటి నిధులను కూడా పూర్తిగా వినియోగించని దుస్థితి. పలు పథకాలకు గత ప్రభుత్వ ఇచ్చిన నిధులతో పోల్చి చూస్తే బీజేపీ ప్రభుత్వ బండారం బయటపడుతున్నది.
గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు పోషకాహారం అందించేందుకు గత యూపీఏ ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం కింద యేటా రూ.14 వేల కోట్ల వరకు కేటాయించేది. గర్భిణులకు ప్రసవమైన ప్రతిసారీ రూ.6 వేలు ఆర్థిక సాయం అందజేసేది. కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం (ప్రధానమంత్రి మాతృ వందన యోజన)కింద ఇచ్చే ఆర్థికసాయాన్ని రూ.5 వేలకు తగ్గించడమే కాకుండా తొలి ప్రసవానికే పరిమితం చేసింది. ఈ పథకానికి రూ.12 వేల కోట్లు కోత పెట్టిన బీజేపీ ప్రభుత్వం.. ఏటా రూ.2 వేల కోట్లు మాత్రమే విదిలిస్తున్నది.
మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామంటూ చెప్పుకొంటున్న మోదీ ప్రభుత్వం ఆచరణలో భిన్నంగా వ్యవహరిస్తున్నది. మహిళల భద్రత కోసం ఉద్దేశించిన నిర్భయ ఫండ్కు గత ఎనిమిదేండ్లలో రూ.6,213 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు రూ.4,138 కోట్లు మాత్రమే విడుదల చేసి, అందులో రూ.2,922 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కేటాయించిన నిధుల్లో సగం కూడా ఖర్చు చేయకపోవడం మహిళల భద్రతపై మోదీ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎండగడుతున్నది.
కేంద్రం తీరు ఎంత దారుణంగా ఉన్నదంటే.. వీధుల్లో చెత్త తొలగించే కార్మికుల జీవితాలను బాగు చేయడం కోసం చేపట్టిన పథకాన్ని సైతం నీరు గార్చింది. వీధుల్లో చెత్తతీసే వారి బాగు కోసం గత ప్రభుత్వం స్వయంఉపాధి పథకం కింద కార్మికులందరికీ ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాలని నిర్ణయించింది. ఈ పథకానికి ఎనిమిదేండ్లలో రూ.1,255 కోట్లు కేటాయించిన బీజేపీ సర్కార్ రూ.236 కోట్లు మాత్రమే వినియోగించింది.
బీజేపీ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. ఎనిమిదేండ్లలో పెన్షన్లు నయా పైసా పెంచలేదు. గతంలో మాదిరిగా వృద్ధులకు రూ.200, దివ్యాంగులు, వితంతువులకు రూ.300 మాత్రమే ఇస్తున్నది. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ర్టాలు ఇస్తున్న పింఛన్లతో పోల్చుకొంటే ఇది చాలా స్వల్పం. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ఆయా వర్గాలకు పింఛన్లు పెంచి, ఆదుకోవాలన్న కనీస స్పృహ కూడా బీజేపీ ప్రభుత్వానికి లోపించింది.
అన్ని వర్గాల ప్రజలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలను అక్కున చేర్చుకొంటూ వారి అభివృద్ధికి పాటుపడుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం వృద్ధులకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016కు చొప్పున అందజేస్తున్నది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులతో పాటు బీడీ, గీత కార్మికులు, బోధకాలు వ్యాధిగ్రస్తులు.. ఇలా అనేక వర్గాలకు పెన్షన్ను అందజేస్తున్నది. పెన్షన్ల కోసం యేటా రూ.11 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తుండటం ఆయా వర్గాల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి తిరుగులేని నిదర్శనం. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవించిన మహిళలకు కేసీఆర్ కిట్ పేరుతో రూ.15 వేల వరకు ఇస్తున్నది. చెత్త ఏరే కార్మికులకు భారీ మొత్తంలో వేతనాలు పెంచి వారిని గౌరవిస్తున్నది.