హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): అదానీ, టాటా, ఎస్సార్, టోరంట్ వంటి నాలుగు కార్పొరేట్ కంపెనీల మేలు కోసమే కేంద్రం విద్యుత్తు సవరణ బిల్లు తెచ్చిందని అలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) జాతీయ అధ్యక్షుడు శైలేంద్ర దూబే ఆగ్రహం ధ్వజమెత్తారు. దీనికి వ్యతిరేకంగా నవంబర్ 23న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ‘సేవ్ పవర్ సెక్టార్-సేవ్ నేషన్’ నినాదంతో రామ్లీలా మైదానం నుంచి జంతర్మంతర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. విద్యుత్తు ఉద్యోగుల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన శైలేంద్ర దూబే శుక్రవారం ‘నమస్తే తెలంగాణకు’ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
నిరవధిక సమ్మెకు సిద్ధం
విద్యుత్తు సవరణ బిల్లు ప్రస్తుతం పార్లమెంటరీ ఎలక్ట్రిసిటీ స్టాడింగ్ కమిటీ పరిశీలనలో ఉన్నది. విద్యుత్తు వినియోగదారులు, ఉద్యోగులతో ఈ కమిటీ సమగ్రంగా చర్చిస్తుందని ఆశిస్తున్నాం. ఇటీవల కమిటీని కలిసి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని కోరాం. కేంద్రం మొండిగా ముందుకెళ్తే నిరవధిక సమ్మెకు వెళ్తాం.
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం
విద్యుత్తు ఉమ్మడి జాబితాలోని అంశం. విద్యుత్తు బిల్లులో 35 చట్ట సవరణలు ప్రతిపాదించారు. వీటిలో సగానికి పైగా రాష్ర్టాల చేతుల్లోనివే. రాష్ర్టాలకు సంబంధించిన అంశాలపై కేంద్రం చట్టం చేయడమేమిటో అర్థం కావడం లేదు. సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమైన ఈ చట్టంతో రాష్ర్టాల అధికారాలకు కత్తెర పడుతుంది. కేంద్ర గుత్తాధిపత్యం కొనసాగుతుంది. విద్యుత్తు అనేది మార్కెట్లో దొరికే లగ్జరీ వస్తువు కాదు. విద్యుత్తును సామాజిక కోణంలో చూడాలి తప్ప.. లాభాలు ఆర్జించిపెట్టే సరుకుగా చూడొద్దు.
కార్పొరేట్లకు మేలు చేసేందుకే..
అదానీ, టాటా, ఎస్సార్ తదితర కంపెనీలు విద్యుత్తు రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. మరికొన్ని కార్పొరేట్ కంపెనీలు జాతీయ బ్యాంక్ల నుంచి రుణాలు తీసుకొని 30 వేల మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లు నెలకొల్పాయి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కుదుర్చుకొన్నాయి. 10 రోజుల క్రితమే అదానీ లిమిటెడ్ ముంబైలోని పన్వేల్లో సమాంతర విద్యుత్తు పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేసింది. ప్రైవేట్ వ్యవస్థలు లాభాలు ఆశించకుండా పనిచేయవు. అంతిమంగా అందరికీ నష్టం కలుగుతుంది.
లాభసాటి ప్రాంతాలు కార్పొరేట్లకు
డిస్కంల నష్టాలకు ప్రభుత్వాలే తప్ప వినియోగదారులు, ఉద్యోగులు కారణం కాదు. డిస్కంలు రూ.1.10 లక్షల కోట్లు జనరేటర్లకు చెల్లించాల్సి ఉండగా.. ప్రభుత్వాలు రూ.1.39 లక్షల కోట్లు డిస్కంలకు బాకీపడ్డాయని నెల రోజుల క్రితమే ప్రధాని మోదీ మన్కీబాత్లో చెప్పారు. రాయితీలు, ప్రభుత్వ బిల్లులను ప్రభుత్వాలు చెల్లించని కారణంగానే డిస్కంలకు నష్టాలొస్తున్నాయి. ఇందుకు కారణమైన వారే నష్టాలను సాకుగా చూపి ప్రైవేటీకరిస్తున్నారు. రాష్ర్టాల్లో ప్రైవేటీకరణ వీలుకాకపోవడంతో కేంద్రపాలిత ప్రాంతాలపై పడ్డారు. చండీగఢ్, పుదుచ్చేరిలో పంపిణీ వ్యవస్థలను ప్రైవేటీకరించారు. చండీగఢ్లో నష్టాలు 9.2 శాతమే. ఏడాదికి అక్కడ టర్నోవర్ రూ.1,000 కోట్లు. వార్షికాదాయం రూ.325 కోట్లు, ఆస్తులు 27 వేల కోట్లు. అయినా కోల్కతాకు చెందిన ప్రైవేట్ కంపెనీకి రూ.871 కోట్లకే కట్టబెట్టారు. కేంద్రానికి ప్రైవేటీకరణపై ఇంత తొందర ఎందుకు?కేంద్రం
తీరు అప్రజాస్వామికం
డిస్కంలు ప్రభుత్వ రంగంలో ఉండటంతో వినియోగదారులకు తక్కువ చార్జీలకు, రైతులకు ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నాయి. దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తు ఇస్తున్నది. ప్రైవేట్ డిస్కంలు వస్తే ఇలాంటి రాయితీలు సాధ్యంకాదు. 60% నష్టాలొచ్చే ప్రాంతాన్ని అదానీ కంపెనీ తీసుకొంటుందా? ఉదాహరణకు 5-7.5 హార్స్పవర్ సామర్థ్యం గల వ్యవసాయ పంపుసెట్ను రోజుకు 6 గంటలు నడిపిస్తే.. 30 యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతుంది. ఇందుకు రోజుకు రూ.250 చొప్పున నెలకు రూ.7,500 విద్యుత్తు బిల్లు చెల్లించాలి. వీటిని రైతులు, సామాన్యులు చెల్లించగలరా? అని ఆలోచించకుండా చట్టాలు తేవడం అప్రజాస్వామికం. ప్రభుత్వ జనరేటింగ్ స్టేషన్లను మూసివేసి, సోలార్, హైడల్ విద్యుత్తు ఉత్పత్తిని ఆపివేసి కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే కేంద్రం తొందరపడుతున్నది.
కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు
విద్యుత్తు సవరణ బిల్లుపై సీఎం కేసీఆర్ గళమెత్తడం, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం హర్షణీయం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడంతో మా ఉద్యమానికి నైతిక మద్దతు లభించింది. ఇందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. కేసీఆర్ మద్దతు ఇస్తున్న విషయాన్ని బిజిలి క్రాంతియాత్రలో దేశమంతటా చెప్తున్నాం. ఇది విద్యుత్తు రంగంతోపాటు యావత్తు దేశాన్ని రక్షించే పోరాటం.
బొగ్గు కొరతపై సీబీఐ విచారణ జరిపించాలి
దేశంలో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేశామని కేంద్ర బొగ్గుశాఖ మంత్రి, బొగ్గు సరఫరాకు రికార్డు స్థాయిలో రైల్వేవ్యాగన్లు, ర్యాక్లు సమకూర్చామని రైల్వే మంత్రి ప్రకటిస్తారు. కానీ బొగ్గుశాఖ మంత్రేమో దేశంలో బొగ్గు కొరత ఉన్నదని చెప్తారు. ఇది కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ విధానానికి నిదర్శనం. కోల్ ఇండియా జారీచేసిన టెండర్లల్లో 70 -80% అదానీ ఎంటర్ప్రైజెస్ దక్కించుకొన్నది. గుజరాత్లో అదాని కంపెనీకి 4,620 మెగావాట్లు, టాటా పవర్కు 4 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్లు ఉన్నాయి. ఇవి విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న బొగ్గుతో నడిచేలా ప్రత్యేకంగా డిజైన్ చేసినవి. ఇందుకే 10% విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలన్న నిబంధన పెట్టారు. ఇదో పెద్ద స్కాం. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి.