హైదరాబాద్, అక్టోబరు 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు బుధవారం రాష్ర్టానికి రానున్నారు. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నీతిశ్కుమార్ వ్యాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్కుమార్ నేతృత్వంలోని బృందం బుధవారం ఉదయం హైదరాబాద్ చేరుకుంటుంది.
బీఆర్కేఆర్ భవన్లో రాష్ట్ర సీఈవో వికాస్రాజ్, ఇతర అధికారులతో కేంద్ర బృందం ఎన్నికల ఏర్పాట్లను సమీక్షిస్తుంది. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్తో భేటీ అవుతారు. ఎన్ఫోర్స్మెంట్ నోడల్ అధికారులతోనూ సమావేశమై తనిఖీల అంశంపై సమీక్షిస్తారు. ఈ నెల 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో లోపాలు, సమస్యలను సమీక్షించి ఆదేశాలు, సూచనలు జారీ చేయనున్నారు.