హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్చాన్స్లర్గా ఓయూ పూర్వ ఆచార్యుడు, తెలంగాణ బిడ్డ ప్రొఫెసర్ డాక్టర్ అనిశెట్టి రవీంద్రనాథ్ నియమితులయ్యారు. ఆయనను వీసీగా నియమిస్తూ కేంద్ర విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఐదేండ్లు ఆయన వీసీగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. అనిశెట్టి రవీంద్రనాథ్ ప్రసుతం గుల్బర్గాలోని కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. 35 ఏండ్లు రిసెర్చ్, 30 ఏండ్లు బోధనా రంగంలో సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం. ఓయూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీల్లో పలు హోదాల్లో సేవలందించారు.
హనుమకొండ కుమారపల్లికి చెందిన రవీంద్రనాథ్ వరంగల్లోని మర్కజీ హైస్కూల్లో పాఠశాల విద్య, ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరంగల్లో ఇంటర్మీడియట్, సీకేఎం (చందాకాంతయ్య మెమోరియల్) కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేశారు. ఓయూ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. జేఎన్టీయూలో ఎంటెక్ పూర్తిచేశారు. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, స్టోనీ బ్రూక్లలో విద్యనభ్యసించారు. 1991లో ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బోధనా వృత్తిలో చేరి, 2006లో ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. ఐఐటీ ఢిల్లీ, మద్రాస్, బాంబే, ఖరగ్పూర్తోపాటు కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ వర్సిటీల్లోను ఆయన శిక్షణ పొందారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ సోమవారం కశ్మీర్ వెళ్లి బాధ్యతలను స్వీకరించనున్నట్టు చెప్పారు. కొత్త బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తానని ధీమా వ్యక్తంచేశారు.