కేంద్ర నిర్ణయంతో రైతులకు తీవ్ర నష్టం
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): విధాన నిర్ణయాలు చేయడంలో మోదీ సర్కారు మ రోసారి తప్పటడుగు వేసింది. దేశంలో ఆహార ధా న్యాల ధరలను నియంత్రించడంలో భాగంగా విదేశాలకు బాస్మతియేతర బియ్యం ఎగుమతులను నిషేధించింది. గురువారం అర్ధరాత్రి నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. తద్వారా వరి ఎక్కువగా పండించే తెలంగాణ రైతుల వాణిజ్య అవకాశాలకు గండి కొట్టింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో మున్ముందు బియ్యం ధరలు భారీగా పెరగడంతోపాటు భారత్పై ఆధారపడిన దేశాల్లో ఆహార సంక్షోభం ఏర్పడవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ బియ్యం వ్యాపారంలో 40% వాటాను కలిగి ఉన్న భారత్ నుంచి బంగ్లాదేశ్, చైనా, నేపాల్, ఆఫ్రికన్ దేశాలు పెద్ద మొత్తంలో బియ్యం దిగుమతి చేసుకుంటున్నాయి. ఇప్పుడు మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఈ దేశాలన్నీ ఆహార కొరతతో అల్లాడే అవకాశం ఉన్నది. భారత్ నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే ప్రైవేటు వ్యాపారులు రైతుల నుంచి అధిక ధరలకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభిస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడంలో విఫలమైన కేంద్రం.. ఎగుమతులపై ప్రణాళికలు చేయడంలోనూ విఫలమైందని విమర్శిస్తున్నారు.
రాష్ట్రంపై మోదీ సర్కారు కక్ష
దేశ అవసరాలను, రాబోయే విపత్తులను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ తెలంగాణలో ఎంతో ముందుచూపుతో వ్యవసాయ ప్రణాళికలు రూపొందించారు. వాటి ఫలితంగా ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం రికార్డు సృష్టించి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. కానీ, తెలంగాణ పట్ల కక్షగట్టిన మోదీ సర్కారు రాష్ట్రంలో ధాన్యాన్ని సేకరించడంలోనూ పక్షపాతంతో వ్యవహరిస్తున్నది. ఎఫ్సీఐ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఎన్నో కొర్రీలు పెడుతున్నది. రాష్ర్టాల ఆహార అవసరాలను తీర్చడంలో కేంద్రం విఫలమవడంతో తెలంగాణ నుంచి బియ్యం సరఫరా చేయాలని పలు రాష్ర్టాలు కోరుతున్నాయి. ఇందుకు సంబంధించి తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఇండెంట్లు సమర్పించినా కేంద్రం పట్టించుకోవడం లేదు.