హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న కేంద్రం, తాజాగా రూఫ్టాప్ సోలార్ సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే వేసేందుకు రంగం సిద్ధం చేసింది. గ్రిడ్ కనెక్ట్ రూఫ్టాప్ సోలార్ ప్రోగ్రాం (జీసీఆర్టీఎస్) ఫేజ్-2లో భాగంగా సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేయనున్నట్టు కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఫేజ్-2 ప్రక్రియ విధివిధానాలను ఇటీవలే కేంద్రం వెల్లడించింది. గతంలో డిస్కంల, రెడ్కో ద్వారా విక్రేతలకు సబ్సిడీని అందజేయగా, తాజాగా లబ్ధిదారుల ఖాతాల్లోనే వేస్తామని కేంద్రం ప్రకటించింది. రూఫ్టాప్ సోలార్ను ఇన్స్టాల్ చేసుకోవడం, గ్రిడ్తో అనుసంధానించే ప్రక్రియను ఈ ఏడాది కేంద్రం సులభతరం చేసింది.
ఇందుకు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో పోర్టల్ను అందుబాటులోకి తీసుకురాగా, ఈ పోర్టల్ను త్వరలోనే ప్రారంభించనున్నారు. రూఫ్టాప్ సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్, రిజిస్ట్రేషన్, తనిఖీ పూర్తయిన తర్వాత లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి సబ్సిడీ విడుదల వరకు పోర్టల్ ద్వారా ట్రాక్చేస్తారు. ఈ విధానం సోలార్ను ప్రోత్సహించేదిగా ఉన్నదని సోలార్ ఎనర్జీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బుర్రా అశోక్కుమార్, రాజేశ్ అభిప్రాయపడ్డారు. గ్రిడ్ కనెక్ట్ రూఫ్టాప్ సోలార్ ప్రొగ్రాం (జీసీఆర్టీఎస్) ఫేస్ -1, ఫేజ్ -2లతో సహా సెంట్రల్ సెక్టార్ ప్రొగ్రామ్ల నిధుల వెచ్చింపును ట్రాక్చేసేందుకు ఇటీవలే కేంద్ర ఆర్థికశాఖ కొత్త ప్రక్రియను ప్రారంభించింది. ఈ కొత్త విధానం ప్రకారం సబ్సిడీలను క్రెడిట్ చేయడానికి లబ్ధిదారులు జీరో సేవింగ్స్ ఖాతాను తెరవాలి.