హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) సంస్థను ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఆరోపించారు. సంస్థలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పిన మాటలు కాగితాలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఉద్యోగాల విషయంపై ఫ్యాక్టరీ యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చి, ఇప్పుడు పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు.
ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి ముందు 95 శాతం ఉద్యోగాలు స్థానికులకేనని నమ్మబలికిన కేంద్రం.. తర్వాత తెలంగాణ ప్రజల ఆశలను వమ్ము చేసిందన్నారు. కొన్ని రోజులుగా సాంకేతిక లోపంతో ఉత్పత్తి నిలిచిపోయినా.. ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం చేస్తామని మోదీ ఏర్పాట్లు చేయడాన్ని తప్పుపట్టారు. సింగరేణి సంస్థను కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్రం కంకణం కట్టుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సింగరేణి ద్వారా ఉపాధి పొందుతున్న 10 లక్షల మంది జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నాన్ని ఖండించారు. సింగరేణిలో 49 శాతం వాటా మాత్రమే కల్గిన కేంద్రం.. సంస్థపై విషం చిమ్ముతున్నదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం, సింగరేణి కార్మికులపట్ల కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా శనివారం రామగుండం వస్తున్న మోదీ ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.