హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్న తరుణంలో ప్రజావైద్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ఏటికేడు వెనుకడుగు వేస్తున్నది. వైద్యరంగానికి నిధుల కేటాయింపును రాష్ర్టాలు పెంచుతుంటే.. మోదీ సర్కార్ మాత్రం నిధులను తగ్గిస్తున్నది. స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘నేషనల్ హెల్త్ అకౌంట్స్’ (ఎన్హెచ్ఏ) నివేదికే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, ప్రజలు చేసిన సొంత ఖర్చులను గణించి ఈ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 2018-19లో దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణకు రూ.5.96 లక్షల కోట్లు (తలసరి వ్యయం రూ.4,470) వెచ్చించారు. ఇది దేశ జీడీపీలో 3.16 శాతానికి సమానం.
ప్రజారోగ్యానికి ప్రభుత్వాలు చేసే వ్యయంలో కేంద్రం నెమ్మదిగా తన వాటాను తగ్గించుకొంటున్నది. 2014-15లో ప్రభుత్వాలు చేసిన వ్యయంలో 37 శాతంగా ఉన్న కేంద్రం వాటా.. 2018-19 నాటికి 34.3 శాతానికి తగ్గించింది. ఇదే సమయంలో రాష్ర్టాల వాటా.. 63 శాతం నుంచి 65.7 శాతానికి పెరిగింది.