Mission life | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): జాతీయస్థాయిలో ఏ అవార్డు ఇచ్చినా మన పల్లెలు, పట్టణాలే ముందు వరుసలో ఉంటున్నాయి. ఏ విభాగంలోనైనా మనమే మేటి. మరో రాష్ట్రం లేదు మనకు సాటి. దీనికి వచ్చిన అవార్డులే నిదర్శనం. కేంద్రప్రభుత్వ ప్రశంసలే అందుకు సాక్ష్యం. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరో పథకంలో కూడా మన రాష్ర్టానికే ఎక్కువ సంఖ్యలో అవార్డులు దక్కేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం మిషన్ లైఫ్ైస్టెల్ ఫర్ ఎన్విరాన్మెంట్ (మిషన్ లైఫ్) పేరుతో పర్యావరణహితంగా పట్టణాలు, గ్రామాలను ప్రోత్సహించే కార్యక్రమానికి నిరుడు శ్రీకారం చుట్టింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పల్లెప్రగతి ద్వారా అమలు చేస్తున్న అంశాలే మిషన్ లైఫ్లోనూ ఉండటంతో రాష్ర్టానికి ఎక్కువ సంఖ్యలో అవార్డులు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా క్షేత్రస్థాయి అధికారులను సన్నద్ధం చేస్తున్నారు. దీనికోసం ప్రణాళిక రూపొందించారు.
2022లోనే మిషన్ లైఫ్ ప్రారంభం
మిషన్ లైఫ్ కార్యక్రమాన్ని 2022 అక్టోబర్ 20న ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. దేశంలోని 80 శాతం పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలను 2028 నాటికి పర్యావరణహితమైన ప్రాంతాలుగా మార్చాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 2022-23లో 77 వేల గ్రామాలు, 2023-24లో 2.06 లక్షలు, 2024-25లో 3.35 లక్షల గ్రామాలు, 2025-26 4.63 లక్షల గ్రామాలు, 2026-27లో 5.15 లక్షల గ్రామాలను పర్యావరణహితమైన గ్రామాలు, పట్టణాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడు క్యాటగిరీల్లో 75 అంశాల్లో లక్ష్యాలను చేరాల్సి ఉంటుంది.
ఏడు క్యాటగిరీలు ఇవే..
విద్యుత్తు, నీటి ఆదా, సింగిల్యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాలను తగ్గించడం, స్థిరమైన ఆహార విధానాన్ని అమలు చేయడం, ఎలక్ట్రానిక్ వ్యవర్థాలను తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడంపై ఏడు క్యాటగిరీలుగా విభజించారు. కేంద్రం సూచించిన ఈ అంశాలన్నీ తెలంగాణలో ఇప్పటికే పెద్ద ఎత్తున అమలు చేస్తున్నది. దీంతో ఈ రంగంలో రాష్ర్టానికి అవార్డులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.