హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి తీసుకొచ్చామంటూ గొప్పలు చెప్పుకొన్న మోదీ సర్కారు, పులుల రక్షణను మాత్రం గాలికొదిలేసింది. నమీబియా నుంచి ఎనిమిది చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులోకి వదిలేటప్పుడు మోదీ ఫొటోలకు పోజులిచ్చారు. రాష్ట్రంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్), కవ్వాల్ టైగర్ రిజర్వ్(కేటీఆర్)లో స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్టీపీఎఫ్) ఏర్పాటుకు మాత్రం మోకాలడ్డుతున్నారు.
రాష్ట్రంలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ 2,010 చదరపు కిలోమీటర్లలో, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ 2,600 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉండగా, వీటి పరిధిలో దాదాపు 30 పులులు ఉన్నాయి. ఆరు జిల్లాల పరిధిలో విస్తరించిన ఇంత పెద్ద ప్రాంతాల రక్షణకు సాధారణ సిబ్బంది సరిపోరు. స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్టీపీఎఫ్) యూనిట్లను ఏర్పాటుచేస్తేనే పులులకు రక్షణ కల్పించవచ్చు. ఈ నెల 6 నుంచి 13 వరకు అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్లను పరిశీలించిన నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) బృందం సైతం రెండు చోట్లా ఎస్టీపీఎఫ్ ఏర్పాటు అవసరమని అభిప్రాయపడింది. 2015లో వీటిని ఏర్పాటుచేయాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు ఉన్నందున.. ఆయుధాలు, యంత్రాలను మావోయిస్టులు అపహరించే ప్రమాదం ఉన్నదంటూ ఈ ప్రతిపాదనలను కేంద్రం తిరసరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టుల అలజడి తగ్గిపోయినప్పటికీ ఎస్టీపీఎఫ్ల ఏర్పాటుపై కేంద్రం స్పందించటం లేదు. ఎస్టీపీఎఫ్ ఏర్పాటుకయ్యే ఖర్చు, నిర్వహణ కేంద్రమే భరించేది. 2017లో ఈ నిబంధనలను మార్చారు. ఎస్టీపీఎఫ్ నాన్-రికరింగ్ వ్యయం(పరికరాలు, వాహనాల కొనుగోలు)లో 60:40, పునరావృత వ్యయం(వేతనాలు, ఇతర ఖర్చులు)ను 50:50 ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్రాలు భరించాలని మార్పులు చేసింది.
ఒకో యూనిట్లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ర్యాంక్ అధికారి నేతృత్వంలో 112 మంది సిబ్బంది ఉంటారు. ముగ్గురు రేంజ్ ఆఫీసర్లు, స్పెషల్ ప్రొటెక్షన్ గార్డులు ఉంటారు. వీరికి గ్రే హౌండ్స్ సిబ్బంది తరహాలో శిక్షణ ఇస్తారు. దేశంలో కర్నాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, రాజస్థాన్, అస్సాంలో 13 ఎస్టీపీఎఫ్లు ఏర్పాటయ్యాయి. మహారాష్ట్ర, ఒరిస్సాలోనూ మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నప్పటికీ వీటిని ఏర్పాటు చేసిన కేంద్రం, తెలంగాణపై మాత్రం వివక్ష ప్రదర్శిస్తున్నది.