హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): గతేడాది భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు నయా పైసా ఇవ్వలేదు. వాగులు, వంకలు పొంగిపొర్లి రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో అప్పట్లో కేంద్ర బృం దమే కండ్లారా పరిశీలించింది. కానీ, ఆ బృందం ఇచ్చిన నివేదికలను కేంద్ర ప్రభుత్వం అటకెక్కించింది. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో దాదాపు ఐదు వేల కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు రూ.210.77 కోట్లు, శాశ్వత పరిష్కారానికి రూ.637.87 కోట్లు అవసరమని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ కేంద్రానికి గత డిసెంబర్లోనే ప్రతిపాదనలు పంపింది. కానీ, కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర నిధుల కోసం ఎదురుచూడకుండా రాష్ట్ర ప్రభు త్వ నిధులతోనే మరమ్మతులు చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే, డబ్బంతా కేంద్రమే ఇస్తున్నదని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రచారం చేయడం విస్మయం కలిగిస్తున్నది.