హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న మరో ప్రతిష్ఠాత్మక పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపీ కొట్టింది. చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయ పథకం తరహాలో ‘అమృత్ సరోవర్’ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని మోదీ సర్కారు నిర్ణయించింది. గత నెల 24న జమ్ములో ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలో 75 చెరువులను పునరుద్ధరిస్తారు. కానీ, 2015 మార్చి 12న కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో మిషన్ కాకతీయ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మొత్తం నాలుగు విడతల్లో 27,584 చెరువుల్లో 2,449.28 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించారు. దీనికోసం ప్రభుత్వం రూ.8,735.32 ఖర్చు చేసింది. ఫలితంగా 21.21 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. పూడిక తీయకముందు ఈ చెరువుల నిల్వ సామర్థ్యం 14.65 టీఎంసీలు ఉండగా, అదనంగా నిల్వ సామర్థ్యం 8.65 టీఎంసీలు పెరిగింది.
చిన్ననీటి వనరులను బాగుచేసేందుకు చేపట్టిన మిషన్కాకతీయ పథకాన్ని నీతిఆయోగ్ అనేకసార్లు ప్రశంసించింది. ఈ పథకానికి రూ.5 వేల కోట్ల నిధులు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసినా కేంద్రం పైసా ఇవ్వలేదు. ఇప్పుడు అదే పథకాన్ని కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా అమలుచేయబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టి హర్ ఘర్ జల్ పథకంగా పేరు పెట్టి అమలుచేస్తున్నారు. రైతులకు పెట్టుబడి సహాయం అందించే రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి ప్రధాన్మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిగా అమలు చేస్తున్నారు.
స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా అమృత్ సరోవర్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 75 చెరువులను పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం ఉపాధి హామీ, 15వ ఆర్థిక సంఘం, పీఎంకేఎస్వై నిధులను వినియోగించుకోవాలని సూచించింది. చెరువుల్లో పూడికతీతతోపాటు చెరువు కట్టలను బలోపేతం చేయడం, తూముల మరమ్మతు తదితర పనులు చేపడుతారు. ఈ పనులను వచ్చే ఆగ స్టు 15 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. రాష్ట్రంలో 32 గ్రామీణ జిల్లాల్లో 75 చెరువుల చొప్పున 2,400 చెరువులను ఎంపిక చేసి పనులు మొదలు పెట్టారు. ఈ చెరువుల్లో పదివేల క్యూబిక్ మీటర్ల మట్టి తీసేలా చెరువును ఎంపిక చేయాలని సూచించారు. వర్షపు నీటిని నిల్వ చేసుకొని ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెంచుకోవాలని, పంటలకు నీరందించే కార్యక్రమాన్ని చేపట్టారు.