హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఏటా లక్ష్యానికి అనుగుణంగా 100 శాతం సీఎమ్మార్ ఇచ్చిన రాష్ట్రంపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరైన చర్య కాదని తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేందర్ హితవు పలికారు. తక్షణమే మిల్లర్ల నుంచి ఎఫ్సీఐ సీఎమ్మార్ తీసుకొనేలా కేంద్రం ఆదేశించి రైస్ ఇండస్ట్రీని ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు. శుక్రవారం హైదరాబాద్లో రైస్ మిల్లర్స్ సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్రెడ్డితో కలిసి మాట్లాడుతూ.. 42 రోజులుగా ఎఫ్సీఐ బియ్యం సేకరణ నిలిపివేయడంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.2500 కోట్ల విలువైన 10 లక్షల టన్నుల ధాన్యం తడిసిముద్దయిందని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కేంద్రం తీసుకోవాలని, లేకుంటే నష్టాలు భరించలేక రైస్ మిల్లర్లు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేశారు.
కేంద్రప్రభుత్వ పీడీఎస్ అవసరాలకనుగుణంగా గత ఏడేండ్లుగా రికార్డు స్థాయిలో కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇస్తున్న తెలంగాణ నుంచి బియ్యం సేకరణ నిలిపివేయడం అన్యాయమని అన్నారు. సీఎమ్మాఆర్ సేకరణకు అనుమతి ఇవ్వాలని ఐదువారాలుగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర ఎంపీలను కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ వారిలో చలనం రాలేదని చెప్పారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైసుమిల్లుల్లో ఉన్న 94 లక్షల టన్నల ధాన్యంలో పది లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయిందని తెలిపారు.
ఎఫ్ఏక్యూ నిబంధనలకు, సీఎమ్మార్ డెలివరీకి ఇది సరిపోదని తెలిపారు. ధాన్యం మొత్తం పాడైపోతుందని పేర్కొన్నారు. ఐదు వారాలుగా 3,200 రైస్ మిల్లులు మూతపడటంతో మిల్లర్లు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కేంద్రం ఇప్పటికైనా సీఎమ్మార్ సేకరణకు అనుమతి ఇవ్వకపోతే ధర్నాలు, రాస్తారోకోలు, రైలురోకో చేపడతామని హెచ్చరించారు.
బండీ.. ఇప్పుడేమంటావ్?
‘రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న పరిస్థితులను కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు వివరించగా సానుకూలంగా స్పందించారు. సీఎమ్మార్ సేకరణ గడువును మరో నెల రోజుల పాటు పొడిగించేందుకు కేంద్రప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది’.. ఈ నెల ఏడో తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వేదికగా చెప్పిన మాటలివి. ఇది జరిగి వారం రోజులైనా అడుగు ముందుకు పడలేదు.