హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 850 రకాల ఔషధ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలపై పెద్దఎత్తున భారం వేస్తూ.. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకే మోడీ సర్కార్ ఈ పని చేసిందని మండిపడ్డారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, వంట నూనెలతోపాటు, నిత్యావసరాల ధరలను భారీగా పెంచడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారన్నారు.
దీనికితోడు ఇప్పుడు ఔషధ ధరలు పెంచడం ప్రజలపై అదనపు భారం వేయడమేనన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో బీపీ, షుగర్, గుండెజబ్బులకు సంబంధించి రెగ్యులర్గా మందులు వాడే పేదలు వైద్యానికి దూరమవుతారని వాపోయారు. ప్రజలకు మందుల ధరలు అందుబాటులో ఉండేలా కేంద్రం తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.