10% రిజర్వేషన్లు, గిరిజనబంధు, పోడుభూముల సమస్యకు శాశ్వత పరిష్కారం, ఆదివాసీ, బంజారా భవనాల నిర్మాణం తదితర చర్యలు తీసుకొన్న సీఎం కేసీఆర్ గిరిజనుల గుండెల్లో ఆరాధ్యుడిగా నిలిచారు. సంత్ సేవాలాల్ మహారాజ్, కుమ్రంభీంను మేమెంతగా పూజిస్తామో సీఎం కేసీఆర్ను అలాగే ఆరాధిస్తాం.
– సత్యవతి రాథోడ్, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): గిరిజనులకు 10% రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొన్న నిర్ణయానికి అనుగుణంగా కేంద్రం తక్షణమే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. గిరిజనుల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ చేశారు. ఆదివారం ఆమె తెలంగాణభవన్లో పలువురు గిరిజన ప్రజాప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. 10% రిజర్వేషన్లు, గిరిజనబంధు, పోడుభూముల సమస్యకు శాశ్వత పరిష్కారం, ఆదివాసీ, బంజారా భవనాల నిర్మాణం తదితర చర్యలు తీసుకొన్న సీఎం కేసీఆర్.. గిరిజనుల గుండెల్లో ఆరాధ్యుడిగా నిలిచారని కొనియాడారు. ఆయనకు గిరిజన జాతి రుణపడి ఉంటుందని చెప్పారు. సంత్ సేవాలాల్ మహారాజ్, కుమ్రంభీంను తామెంతగా పూజిస్తామో సీఎం కేసీఆర్ను అలాగే ఆరాధిస్తామని తెలిపారు.
ఇందిరాగాంధీ గరీభీ హఠావో నినాదంతో ఒకట్రెండు కార్యక్రమాలు చేపట్టినందుకే ఆమెను దేశ ప్రజలు మరచిపోలేదని గుర్తుచేశారు. నాడు గరీభీ హఠావో లాంటి కార్యక్రమాలు చేపడితే.. నేడు మోదీ ప్రభుత్వం పేదలను నిర్మూలించటమే పనిగా పెట్టుకొన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపదను సృష్టించి, దానిని పేదలకు పంచడం కేసీఆర్ విధానమైతే.. సంపదను ఒకరిద్దరికి దోచిపెట్టడం మోదీ సర్కార్ విధానమని దుయ్యబట్టారు. బీజేపీ విధానాలతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ.. దేశంలో ఏ ఒక్క వర్గానికీ న్యాయం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉండి కూడా గిరిజనులకు ఏమీ చేయని బీజేపీ.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దుర్మార్గానికి నిదర్శనమని చెప్పారు.
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీపై సంతోషం వ్యక్తం చేస్తూ ఆదివారం హైదరాబాద్లోని ఆదివాసీ, బంజారాభవన్ల వద్ద నృత్యం చేస్తున్న బంజారాలు
1961 నుంచి ఎస్టీ జనాభా పెరగలేదా?: సీతారాంనాయక్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఆదివాసీ గిరిజన సమాజ స్థితిగతులు ఏమీ తెలియవని మాజీ ఎంపీ, ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ విమర్శించారు. ఎస్టీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పెంచుకోవచ్చని రాజ్యాంగమే స్పష్టం చేసిందని తెలిపారు. 1961 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎస్టీలకు 7.5% రిజర్వేషన్లు ఇచ్చారని, అప్పటినుంచి ఇప్పటిదాకా దేశంలో ఎస్టీ జనాభా పెరగలేదా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయానికి అనుగుణంగా కేంద్రం తక్షణమే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్లు రామచంద్రనాయక్, వాల్యానాయక్, గిరిజన నేత రూప్సింగ్, రమణానాయక్ తదితరులు పాల్గొన్నారు.
కిషన్రెడ్డి కేంద్రాన్ని ఒప్పించాలి: ఎంపీ మాలోత్ కవిత
గిరిజన రిజర్వేషన్లపై కిషన్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని తక్షణమే ఒప్పించాలని ఎంపీ మాలోత్ కవిత డిమాండ్ చేశారు. గిరిజన సమాజాన్ని బీజేపీ ఎంతోకాలం మోసం చేయలేదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలను దేశవ్యాప్తంగా గిరిజన సమాజం హర్షిస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే అందరి జీవితాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు.
కుమ్రంభీం కలల సాధకుడు కేసీఆర్: రేగా కాంతారావు
ఆదివాసీ పోరాటయోధుడు కుమ్రంభీం కలల్ని నిజం చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కొనియాడారు. తెలంగాణ ఏర్పడక ముందు ఏజెన్సీ ప్రాంతాలు రోగాలతో మంచాన పడేవని, సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యలతో ప్రస్తుతం సీజనల్ వ్యాధులు పూర్తిగా తగ్గిపోయాయని వివరించారు. ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో వారిలో గుణాత్మక మార్పు వచ్చిందని చెప్పారు.
ఆషామాషీ నిర్ణయం కాదు : ఎమ్మెల్యే రవీంద్రకుమార్
ఎస్టీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ ఆషామాషీగా తీసుకోలేదని, దాని వెనుక శాస్త్రీయ అధ్యయనం ఉన్నదని ఎమ్మెల్యే రమావత్వ్రీంద్రకుమార్ తెలిపారు. గిరిజనుల జీవితాలను సీఎం కేసీఆర్ సువర్ణాక్షరాలతో లిఖించారని కొనియాడారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక కఠోర మేధోమథనం ఉంటుందని వివరించారు. ఇవేవీ తెలుసుకోకుండా బీజేపీ నేతలు దుర్మార్గాలకు ఒడిగడుతున్నారని, తాము తలచుకుంటే ఏ ఒక్క బీజేపీ నేత కూడా తండాల్లో కాలుపెట్టలేరని హెచ్చరించారు.