హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏదైనా మాట్లాడేటప్పుడు కచ్చితమైన సమాచారం ఇవ్వాలి. నోటికొచ్చినట్టు మాట్లాడితే నవ్వులపాలు అవుతారు. ఈ మాత్రం కనీస అవగాహన లేకుండా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇష్టారాజ్యంగా అబద్ధాలు వల్లెవేశారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంతో దేశ అప్పులు రూ.169 లక్షల కోట్లకు చేరుకుంటాయని వెల్లడైంది. ఇది దేశ జీడీపీతో పోల్చితే 56.2 శాతం. కేంద్రం అనేక సందర్భాల్లోనూ ఇదే విషయాన్ని చెప్తూ వచ్చింది.
మోదీ పాలనలో దేశం అప్పుల కుప్పగా మారిందని దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్నది. కానీ, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి మాత్రం దేశ జీడీపీలో అప్పులు కేవలం 19.9 శాతంగా చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఆర్థిక నిపుణులు, రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. ‘ఇదేంది కిషన్రెడ్డీ.. ఇంత సులభంగా దొరికియే అబద్ధాలు ఆడితే ఎలా?’ అని ప్రశ్నిస్తున్నారు.