హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): జన్యుసంబంధ వ్యాధులపై పరిశోధనల కోసం హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనున్నట్టు ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. జెనెటిక్ సైన్స్పై శనివారం జీన్ పవర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం జయేశ్రంజన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ వివిధ రంగాలకు కేంద్రంగా ఉన్నదని తెలిపారు. ఐటీ, ఫార్మా రంగాలతో వైద్యరంగంలోనూ విశిష్ఠ సేవలను అందిస్తున్నదని చెప్పారు. నగర శివారులోని జీనోమ్వ్యాలీలో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. దేశంలోనే అత్యుత్తమ ఇన్నోవేషన్ సెంటర్గా టీహబ్ విరాజిల్లుతున్నదని చెప్పారు. జీన్ పవర్ వ్యవస్థాపకుడు, డాక్టర్ కళ్యాణ్ ఉప్పలూరి మాట్లాడుతూ.. ఒకే రకమైన మందులను రోగులందరికీ ఇచ్చే విధానం మారుతున్నదని చెప్పారు. వేర్వేరు వ్యక్తుల వ్యక్తిగత జన్యులను పూర్తిస్థాయిలో పరీక్షించి మందులను అందించే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. దీనిపై తమ సంస్థ అధ్యయనం చేసి కొత్త చికిత్స విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జీన్ పవర్ వైద్యురాలు డాక్టర్ హిమ చల్లాతోపాటు నగరంలోని వివిధ దవాఖానల వైద్యులు పాల్గొన్నారు.