హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): దేశంలో కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తున్నదని.. ప్రధాని మోదీ నియంతలా మారారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మరో ప్రత్యామ్నాయం లేకనే బీజేపీ ఆటలు సాగుతున్నాయని పేర్కొన్నారు. గురువారం మండలి ప్రాంగణంలోని తన చాంబర్లో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావుతో కలిసి మీడియాతో చిట్చాట్ జరిపారు. విభజన హామీలను నెరవేర్చటంలో కేంద్రం తెలంగాణపై నిర్లక్ష్యం, వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదాతోపాటు.. చంద్రబాబు మీద ప్రేమతో ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపిన కేంద్రం విభజన హామీలను నెరవేర్చడంలో చూపించడంలేదని పేర్కొన్నారు. రాజకీయ కోణంలో కాకుండా ప్రజల కోణంలో ఆలోచిస్తే పోలవరం సమస్యకు జవాబు లభిస్తుందని చెప్పారు.
ముంపు సమస్యపై తెలంగాణ మాట్లాడితే.. హైదరాబాద్ గురించి మాట్లాడేవారు.. 1956 కన్నా ముందు పరిస్థితిని ఊహించుకోవాలని చెప్పారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ఆంధ్రా.. ఇప్పుడు వాళ్లు అడిగితే తిరిగి వెళ్తారా అని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ.. ప్రతి సమస్యను రాజకీయ ప్రయోజనాల కోణంలో ఆలోచించడం వల్లనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారెవరైనా వారి హోదాకు తగ్గట్టుగా వ్యవహరించాలని.. దురదృష్టవశాత్తూ ఇటీవల ఆ సంప్రదాయం కొరవడిందని గుత్తా అన్నారు. గవర్నర్, మండలి చైర్మన్ వంటి పదవులు రాజ్యాంగబద్ధమైవని పదవులని.. వాటిని రాజకీయ స్వార్థం కోసం వాడుకోకూడదని అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను కూలదోయటమే పనిగా పెట్టుకొన్నదని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఎట్లున్నప్పటికీ.. రాష్ట్రంలో ఆ పరిస్థితి తలెత్తదన్నారు. అందుకు రాంలాల్ ఎపిసోడ్ ఉదాహరణ అని గుర్తుచేశారు. గవర్నర్గా రాంలాల్ ఉన్నప్పుడు నెలకొన్న అనిశ్చితి తదనంతర పరిణామంతో కేంద్రానికి, గవర్నర్కే చెడ్డపేరు వచ్చిందని తెలిపారు.
ఇటీవల కేంద్రం నిషేధించిన అన్పార్లమెంటరీ పదాల జాబితాను రాష్ర్టాల బీజేపీ అధ్యక్షులకు, కేంద్ర మంత్రులకు, ఆ పార్టీ నేతలకు పంపిస్తే బాగుంటుందని గుత్తా సలహా ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన అంశం విభజన చట్టంలోనే ఉన్నా పట్టించుకోకుండా జమ్ము కశ్మీర్లో సీట్లను పెంచడం కేంద్రం ఏకపక్ష వైఖరికి నిదర్శమన్నారు.
అనతికాలంలో తెలంగాణలో ప్రగతి.. అమలవుతున్న పథకాలపై దేశమంతటా చర్చ జరుగుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్రం అప్పుల గురించి మాట్లాడేవారు కేంద్రం చేసిన రూ.వంద లక్షల కోట్ల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.
ఫ్లోరైడ్ సమస్యను మునుగోడు నుంచి తరిమేసిన చరిత్ర సీఎం కేసీఆర్దేనని గుత్తా కొనియాడారు. త్వరలోనే మునుగోడుకు సాగునీరు కల సాకారం కాబోతున్నదని చెప్పారు. మునుగోడును పట్టించుకొన్నది, అభివృద్ధి చేసింది ముఖ్యమంత్రేనని స్పష్టంచేశారు.
మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా అంశం ఆయనకు సంబంధించిన అంశమని, నిజంగా రాజీనామాచేస్తే అన్నదమ్ములు ఇద్దరూ (కోమటిరెడ్డి బ్రదర్స్) మునుగుతారన్నారన్నారు. తాను చైర్మన్ పదవిలో సంతోషంగా ఉన్నానన్నారు.
తెలంగాణ ప్రజల ఐక్యతను, సఖ్యతను ఎవరూ చీల్చలేరని గుత్తా స్పష్టంచేశారు. రాజన్న రాజ్యం తెస్తానని చెప్తున్నవారికి ఏపీలో పనికానీ, తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. ‘రాజన్న రాజ్యం తేవాలనుకొంటే ఏపీలో తిరిగితే ప్రయోజనం ఉండొచ్చు కానీ, తెలంగాణలో తిరిగితే ఏం ప్రయోజనం ఉండదు. రాజన్న రాజ్యం కావాలంటే ఏపీకి పోవాలి’అని గుత్తా సూచించారు.