హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ జలాల కోసం, ప్రాజెక్టుల మంజూరు కోసం విభజన చట్టంలోని హామీల అమలు కోసం ప్రగతి పథంలో తెలంగాణను మరింత ముందుకు నడిపేందుకు అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించడం లేదు. వీటి విషయమై సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి లేఖలు రాయడంతోపాటు ప్రధాని నరేంద్రమోదీని స్వయంగా కలిశారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలను ఎన్నోమా ర్లు కేంద్ర మంత్రుల వద్దకు పంపి ఈ అంశాలపై విన్నవించిన తెలంగాణ ప్రభుత్వం.. కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ రాష్ట్ర డిమాండ్ల సాధనకు పట్టుబడుతున్నది. అవకాశం వచ్చినప్పుడల్లా ఆయా అంశాలపై గళమెత్తుతూ సమస్యల పరిష్కారానికి డిమాం డ్ చేస్తున్నది. కానీ, ఇతర రాష్ట్రాలకు వరాలు ప్రకటిస్తూ నిధుల వరద పారిస్తున్న మోదీ సర్కారు.. తెలంగాణకు మాత్రం నిధులివ్వడం లేదు. కనీసం సమాధానం చెప్పడం లేదు.
తెలంగాణకు కేంద్రం గత 9 ఏండ్ల లో ఏమాత్రం సాయం అందించకపోగా రాష్ట్ర ప్రగతిని అడుగడుగునా అడ్డుకుంటున్నది. నిధులు, ప్రాజెక్టులు, పథకాల్లో బీజేపీ పాలిత రాష్ర్టాలకు పెద్దపీట వేస్తూ తెలంగాణకు మొండిచెయ్యి చూపుతున్నది. అంతటితో ఆగకుండా ఇప్పటికే తెలంగాణలో ఉన్న వాటికే ఎసరు పెడుతున్నది. ఎరువుల కేటాయింపు నుంచి పంట దిగుబడుల కొనుగోళ్ల వరకు నిబంధనలను ఇష్టారాజ్యంగా మారుస్తూ తెలంగాణకు అనేక కొర్రీలు పెడుతున్నది. కాగ్, నీతి ఆయోగ్, పలు ఇతర కేంద్ర సంస్థలు అనేక విషయాల్లో తెలంగాణపై ప్రశంసల వర్షం కురిపిస్తూ రాష్ర్టానికి అదనంగా నిధులు ఇవ్వాలని సిఫారసు చేస్తుంటే కేంద్రం మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. చట్టబద్ధంగా తెలంగాణకు రావాల్సిన నిధుల్లోనూ కోతలు పెడుతున్నది. విద్యుత్తు, సాగునీటి ప్రాజెక్టుల కోసం రాష్ర్టానికి రుణాలిచ్చిన సంస్థలపై ఒత్తిడి పెంచుతూ తెలంగాణకు నిధుల రాకుండా మోకాలడ్డుతున్నది. బొగ్గు గనులను కేటాయించకుండా సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కుట్రలు పన్నుతున్నది. ‘బల్క్ డ్రగ్ పార్క్’ పథకంలో గుజరాత్, హిమాచల్ప్రదేశ్, ఏపీలకు చోటు కల్పించి.. అన్ని అనుకూలతలున్న హైదరాబాద్ను విస్మరించింది. తెలంగాణలో పలు చారిత్రక కట్టడాలు, పుణ్యక్షేత్రాలు, ప్రకృతి రమణీయతకు నెలవైన మనోహర ప్రాంతాలు ఉన్నప్పటికీ వాటిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టడం లేదు. హైదరాబాద్ను గతంలో ఎన్నడూ లేనివిధంగా వరదలు ముంచెత్తితే నయాపైసా ఇవ్వలేదు. హైదరాబాద్లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఆర్బిట్రేషన్ సెంటర్) ఏర్పాటుకూ పైసా విదల్చలేదు. దీనికి పోటీగా గుజరాత్లో మరో ఆర్బిట్రేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడంతోపాటు వరద సాయం కింద ఆ రాష్ర్టానికి భారీగా నిధులు ఇవ్వడం మోదీ సర్కార్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం.