నల్లగొండ, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘రోజుకో విధమైన అంశాలతో కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తూ దేశంలో అరాచకాన్ని సృష్టిస్తున్నది. ఇప్పటికే డీజిల్, పెట్రోల్ ధరలతోపాటు జీఎస్టీ భారం వేసింది. తాజాగా పాలు, పెరుగు, చివరకు శ్మశాన వాటికలనూ వదలకుండా జీఎస్టీ విధించిన కేంద్ర సర్కార్.. ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నది’ అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ర్టానికి రావాల్సిన రూ.23 వేల కోట్ల నిధులను కేంద్రం నిలిపివేసిందన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులు బ్రహ్మాండంగా జరుగుతుండగా.. కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు దేశ సమగ్రతకు మంచిది కాదన్నారు. తెలంగాణకు రావాల్సిన అప్పుల విషయంలో కూడా కేంద్రం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. రావాల్సిన గ్రాంట్లకు కేంద్రం అడ్డుపడుతుందని విమర్శించారు. మోదీ పాలనలో ప్రజలు బతికేలా లేరని, కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజలను పీక్కుతింటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ, సీబీఐలను ఉసిగొల్పి మాట వినని ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేయడమే కేంద్రం పనిగా పెట్టుకొన్నదన్నారు.