హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యుత్తు సంస్థలపై కేంద్రం అనేక ఆంక్షలు విధిస్తూ.. ఇబ్బందులు పెడుతున్నదని, ఇంజినీర్లు, ఉద్యోగులు, అప్రమత్తంగా ఉండి మన విద్యుత్తు సంస్థలను కాపాడుకోవాలని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు సూచించారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్పీఈఏ) ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఇంజినీర్స్డేకు ప్రభాకర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యోగులు భయపడాల్సిన పనిలేదని, సీఎంగా కేసీఆర్ ఉన్నంత కాలం.. విద్యుత్తు సంస్థలను ప్రైవేట్పరం కానివ్వమని, కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. బకాయిల పేరుతో రెండుసార్లు విద్యుత్తు కొనుగోలును అడ్డుకున్నారని, ఇన్ని కుట్రలు చేసినా ఒక్క నిమిషం కరెంట్ పోనివ్వలేదని అన్నారు.
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రూ. 37,600 కోట్లు వెచ్చించి విద్యుత్తు వ్యవస్థను పటిష్టంచేశామని, 24 గంటల విద్యుత్తు అందిస్తున్నామని పేర్కొన్నారు. నిరంతర విద్యుత్తును అందించడంలో ఇంజినీర్లు, ఉద్యోగుల కృషి అభినందనీయమని చెప్పారు. సీఎం కేసీఆర్తో చర్చించి ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్గా మార్చే సమస్యను సైతం పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, డైరెక్టర్లు టీ శ్రీనివాస్, మదన్మోహన్రావు, జగత్రెడ్డి, సచ్చిదానందం, సూర్యప్రకాశ్, స్వామిరెడ్డి, పర్వతం, నర్సింహారావు, గంప గోపాల్, టీఎస్పీఈఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పీ రత్నాకర్రావు, నాయకులు పీ సదానందం, వెంకటనర్సింహారెడ్డి, అంజయ్య, గోపాల్రావు, గోపాలకృష్ణ, శ్రీనివాస్రెడ్డి భాగయ్య, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.