సంగారెడ్డి : తెలంగాణలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టలేదన్న కక్షతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన రూ. 30 వేల కోట్లను నిలిపివేసిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు(Minister Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సంగారెడ్డి(Sangareddy ) జిల్లా పరిషత్లో జరిగిన జడ్పీ సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రలో మోటర్ల(Motors)కు మీటర్లు(Meters) పెట్టడం వల్ల అక్కడి ప్రభుత్వానికి నిధులు మంజూరు చేసిందని తెలిపారు. మన తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ను ఇస్తుంటే మోదీకి నచ్చట్లేదని, అందుకే మనకు ఇచ్చే నిధులను విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతున్నదని హరీష్రావు అన్నారు.
వెనుకబడిన జిల్లాలకు ఇవ్వవలసిన రూ.1350 కోట్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రావాల్సిన రూ. 24 వేల కోట్లను నిలిపివేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణకు రూ. 1300 కోట్ల ఇవ్వాలని నీతి అయోగ్ చెప్పినా కేంద్రం ఇవ్వలేదని అన్నారు. రైతుల కోసం కల్లాలు నిర్మిస్తే కేంద్రం డబ్బులు వాపస్ కట్టించుకుందని విమర్శించారు.
తెలంగాణలో వ్యవసాయానికి కరెంట్ సరిపోవడం లేదని,అదనంగా యూనిట్ కి 20 నుంచి 30 రూపాయలు ఇచ్చి నెలకు రూ. 1500 కోట్లు అదనంగా చెల్లించి విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు.రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులకు సీపీఆర్(CPR) పై అవగాహన కల్పించారు.