హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): భారతీయ చిత్రకళకు ఊపిరినిచ్చిన ప్రఖ్యాత చిత్రకారుడు డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు జయంతిని పురస్కరించుకొని ఈ ఏడాది మొత్తం శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శనివారం మాసబ్ట్యాంక్ జేఎన్ఏఎఫ్ఏయూ కళాశాల ప్రాంగణంలో శేషగిరిరావు శత జయంతి వేడుకలను ప్రారంభించనున్నారు.
శేషగిరిరావు కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో పనిచేసిన సమయంలో ‘ఆనంద్ గడప, నిర్మల బిలుక’ ఇంగ్లిషులో రచించిన పుస్తకాన్ని జేఎన్ఏఎఫ్ఏయూ వైస్ చాన్స్లర్ డాక్టర్ కవిత ధర్యానిరావు, ఎమ్మెల్సీ సురభి వాణిదేవీలు ఆవిష్కరించనున్నారు. చిత్రకళా విభాగంలో అకడమిక్లో ఫస్ట్క్లాస్ తెచ్చుకున్న విద్యార్థికి ‘కొండపల్లి ఎక్సలెన్సీ’ అవార్డును ఆయన కుటుంబ సభ్యులు అందజేయనున్నారు. రెండు రోజుల క్రితం ఫైనార్ట్స్ విద్యార్థులు ముగ్గుల పోటీ నిర్వహించగా.. అందులో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ బహుమతులను ఇదే వేదికగా ఇవ్వనున్నారు.
దేశం గర్వించదగ్గ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు తెలంగాణ బిడ్డ. 1924 జనవరి 27న ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ సమీపంలోని పెనుగొండ గ్రామంలో శేషగిరిరావు జన్మించారు. బాల్యం నుంచే చిత్రకళపై మక్కువ పెంచుకున్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం, రాజస్థాన్లోని బనస్థలి విద్యాపీఠ్, హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాప్ట్స్లో విద్యనభ్యసించారు. కలకత్తాలోని విశ్వభారతి శాంతినికేతన్లో నందలాల్ బోసు శిక్షణలో తన కళకు మెరుగులు దిద్దుకున్నారు.
ప్రకృతి చిత్రాలు వేసినా.. పురాణాల కథాంశాలతో బొమ్మలు దించినా శేషగిరిరావు బొమ్మల రారాజు అని, చిత్రకళా పండితుడని పేరుగాంచారు. హైదరాబాద్లోని ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో 40 ఏండ్లు లెక్చరర్గా ఉద్యోగం చేసి, ప్రిన్సిపాల్గా పదవీ విరమణ పొందారు. తెలుగు విశ్వ విద్యాలయం శేషగిరిరావుకు డాక్టరేట్ ప్రదానం చేసింది. 2012 జులై 26న శేషగిరిరావు కన్నుమూశారు.