Hyderabad | బంజారాహిల్స్, ఆగస్టు 28: అనతికాలంలోనే మహాద్భుతంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ మహానగరంపై సెలబ్రిటీలు మనసు పారేసుకుంటున్నారు. విదేశాల్లో ఉండొచ్చిన వారు సైతం నగరాభివృద్ధికి ముచ్చటపడుతున్నారు. హైదరాబాద్ అమెరికాను తలపిస్తున్నదంటూ మనసులో మాటను బయటపెడుతున్నారు. విశాలమైన రోడ్లు, నిరంతర విద్యుత్తు సరఫరా, అంతర్జాతీయస్థాయి మౌలిక సదుపాయాలు హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చాయి. తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ కూడా ఇటీవల హైదరాబాద్పై పొగడ్తల వర్షం కురిపించారు. ఒకరేమిటి ఎందరో సెలబ్రిటీలు హైదరాబాద్ను చూసి ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ చేరారు. బాలకృష్ణ సరసన లెజెండ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సోనాల్ ఇటీవల విడుదలైన ఆదిపురుష్ సినిమాలోనూ మెరిశారు. కడ్తాల్లో ఓ ప్రైవేటు డెవలపర్స్ లగ్జరీ విల్లాలకు సంబంధించి జూబ్లీహిల్స్లో జరిగిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరాభివృద్ధిని చూస్తుంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని అనిపిస్తున్నదని పేర్కొన్నారు.
బాలీవుడ్లోని పలువురు నటీనటులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు తెలిపారు. శంషాబాద్ నుంచి కారులో జూబ్లీహిల్స్ వస్తుంటే విదేశాల్లో ఉన్నట్టే అనిపించిందని చెప్పుకొచ్చారు. దేశంలోని మరే నగరంలోనూ ఇంత భారీ భవనాలు కనిపించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక్కడి నిర్మాణాలు, అభివృద్ధి చూస్తుంటే తనకు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన వస్తున్నదని వివరించారు. ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులకు తరలివస్తున్న విషయం తనకు తెలిసిందని సోనాల్ చౌహాన్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని మౌలిక వసతులు, ఆకాశహర్మ్యాలు చూస్తుంటే తనకు న్యూయార్క్లో ఉన్నట్టు అనిపించిందని రజనీకాంత్ ఇటీవల ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా నుంచి వచ్చిన లయ కూడా నగరాభివృద్ధికి ఫిదా అయ్యారు. ఇటీవల తాను హైదరాబాద్లో పలు ప్రాంతాలు తిరిగానని, నగరాన్ని చూస్తుంటే తనకు అమెరికాలోనే ఉన్నట్టుగా ఉందని పేర్కొన్నారు. చివరికి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా హైదరాబాద్ అభివృద్ధిని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. హైదరాబాద్ పరిసరాల్లో ఎకరం భూమి అమ్మితే ఏపీలో వంద ఎకరాల భూమిని నుగోలు చేయవచ్చంటూ నగరాభివృద్ధిని కొనియాడారు.