మల్యాల, జూన్ 4: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో వైశాఖ బహుళ దశమిని పురస్కరించుకొని శుక్రవారం హనుమాన్ పెద్ద జయంతి వేడుకలను నిర్వహించారు. కొవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో ఆలయంలోనే నిరాడంబరంగా ఉత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. స్వామివారికి పట్టువస్ర్తాలు, పుష్పాలు, పండ్లు, తలంబ్రాలను పంపించారు. అర్చకులు తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, ద్రావిడ పారాయణాలు చేసి చందనాలంకరణ చేశారు. ఉదయం 10 గంటలకు తులసీ అర్చన, స్వామివారి మూలవిరాట్కు అభిషేకం, పంచామృతాభిషేకం, సహస్ర నాగవల్లి అర్చన వంటి పూజలు నిర్వహించారు. యాగశాలలో ఆంజనేయస్వామి ఉత్సవమూర్తికి మంగళస్నానం చేయించి, నూతన పట్టువస్ర్తాలతో అలంకరించారు. ఊయల సేవ చేశారు. సాయంత్రం స్వామివారికి ఆరాధన, అమ్మవారికి కుంకుమార్చన చేసి ఒడిబియ్యం సమర్పించారు. సహస్రదీపాలు వెలిగించారు. స్వామివారిని గరుడవాహనంపై ఆలయ వీధుల గుండా ఊరేగించారు. యాగశాలలో త్రయాహ్నిక త్రికుండాత్మక యజ్ఞాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి చేశారు.