హూజూరాబాద్ నియోజకవర్గంలో సంబురాలు
ఇల్లందకుంట రూరల్/జమ్మికుంట రూరల్/వీణవంక, సెప్టెంబర్ 4: లబ్ధిదారుల ఖాతాల్లో దళితబంధు పథకం నిధులు జమకావడంపై హుజూరాబాద్ నియోజకవర్గంలో సంబురాలు హోరెత్తాయి. శనివారం ఇల్లందకుంట మండలం సిరిసేడు, జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి, తనుగుల, వీణవంక మండలం నర్సింహులపల్లిలో దళితులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సిరిసేడులో జరిగిన సంబురాల్లో చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డప్పుచప్పుళ్ల మధ్య సీఎం కేసీఆర్, అంబేద్కర్ చిత్రపటాలతో గ్రామంలో ఊరేగింపు తీశారు. అనంతరం పటాకులు కాల్చారు. ఎస్సీ కాలనీ వాసులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ.. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. నవ శకానికి మరో అంబేద్కర్గా సీఎం కేసీఆర్ను అభివర్ణించారు. జమ్మికుంట మండలం తనుగుల, వెంకటేశ్వరపల్లి గ్రామాల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాల్గొన్నారు.