హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 12(నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. కస్టడీలో ఉన్న ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ అలియాస్ నందూ ఇచ్చిన సమాచారం మేరకు శనివారం పలుచోట్ల సోదాలు నిర్వహించింది. ఈ కేసులో కీలక నిందితుడు నందూ ఇంట్లో తొలుత సోదాలు నిర్వహించిన సిట్ బృందం ఆ తరువాత సాయంత్రం ఫిల్మ్నగర్లో నందూకు చెందిన డెక్కన్ కిచెన్ హోటల్లో తనిఖీలు చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన రామచంద్ర భారతి, తిరుపతి నుంచి వచ్చిన సింహయాజి ఇదే హోటల్లో బస చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు హోటల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను సేకరిస్తున్నట్టు సమాచారం. బీజేపీ దూతలు ఈ హోటల్కు ఎప్పుడు వచ్చారు? వారితో ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరితో సమావేశమయ్యారు? ఎన్ని రోజులు బస చేశారు? అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు రామచంద్ర భారతి గత నెల 26న ఢిల్లీ నుంచి విమానంలో వచ్చినట్టు దర్యాప్తులో తేలింది. కాగా ఆయనతోపాటు ఇంకా ఎవరైనా వచ్చారా? అని ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఇవ్వజూపిన వందల కోట్ల రూపాయల్లో ఏమైనా తెచ్చారా? రామచంద్ర భారతితోపాటు వచ్చిన వ్యక్తులు హోటల్లో బసచేశారా? అనే వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. ఆ ముగ్గురు దూతలతో దగ్గరి సంబంధాలున్న ఒక అడ్వకేట్ ఈ హోటల్కు తరచూ వచ్చేవాడనే సమాచారం అందడంతో ఆ దిశగా కూడా కీలక సమాచారం రాబట్టినట్టు సమాచారం. హోటల్ సిబ్బందిని సైతం సిట్ బృందం ప్రశ్నించినట్టు తెలియవచ్చింది.
నందూ ఇంట్లో కీలక ఆధారాలు
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న మొయినాబాద్ పోలీసులతో కలిసి రాజేంద్రనగర్ ఏసీపీ, వెస్ట్జోన్ పోలీసులు శనివారం మధ్యాహ్నం బంజారాహిల్స్ ఆదిత్యా హిల్టాప్ అపార్ట్మెంట్లోని నందు ఇంటికి వచ్చారు. నందు ఇంటికి గత కొన్నిరోజులుగా ఎవరెవరు వచ్చారు.. ఎవరితో స్నేహాలు ఉన్నాయనే విషయాలను ఆరా తీశారు. నందు భార్యతో పాటు కుటుంబసభ్యులతో మాట్లాడి పలు వివరాలను సేకరించారు. అపార్ట్మెంట్లోని సీసీ ఫుటేజీని పరిశీలించడంతోపాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. సుమారు నాలుగుగంటలపాటు తనిఖీలు కొనసాగాయి. పోలీసులు పలు కీలకమైన ఆధారాలను, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి అత్యంత దగ్గరి బంధువైన కరీంనగర్కు చెందిన న్యాయవాదితో నందూకు గల స్నేహంపై కూడా కుటుంబసభ్యులను ఆరా తీసినట్టు తెలిసింది.