హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి, 12వ తరగతి వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించనున్నట్టు ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ సన్యం భరద్వాజ్ తెలిపారు. దేశంలోని వివిధ రాష్ర్టాలతో పాటు 26 విదేశాలకు చెందిన మొత్తం 38,83,710 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని వెల్లడించారు. పదోతరగతి పరీక్షలకు 24,491 బడుల నుంచి 21,86,940 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు.
పది పరీక్షల నిర్వహణకు 7,240 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. 12వ తరగతి పరీక్షలకు 16,738 పాఠశాలల నుంచి 16,96,770 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. ఈ పరీక్షలకు 6,759 పరీక్షా కేంద్రాలను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. పదో తరగతి పరీక్షలు 76 సబ్జెక్టులకు 16 రోజులు, 12వ తరగతి పరీక్షలు 115 సబ్జెక్టులకు 36 రోజుల పాటు నిర్వహించనున్నట్టు భరద్వాజ్ వివరించారు.