ఖైరతాబాద్, అక్టోబర్ 6: ‘జనాభాలో 50 శాతం ఉన్నా అన్ని రంగాల్లో వెనుకబడి పోయాం.. చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేదు.. అందుకే మా వాటా, మా భవిష్యత్తు ఏందో తేల్చాలి. బీసీ కుల గణన చేపట్టకుంటే కేంద్రంలోని బీజేపీ సర్కారుతో తాడోపేడో తేల్చుకుంటాం’ అని బీసీ నేతలు, మేధావులు హెచ్చరించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ‘బీసీ ఉద్యోగులు, మేధావుల రౌండ్టేబుల్’ సమావేశం నిర్వహించారు. సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ కులగణన చేయాల్సిందేనని వక్తలు తేల్చిచెప్పారు. బీజేపీ సర్కారు ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు వేయబోమని స్పష్టంచేశారు.
బీసీ కుల గణనను చట్టం అనుమతిస్తుందని, కోర్టులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ జనాభా లెక్కలు లేకుండా దేశంలోని కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు బడ్జెట్ కేటాయింపులు ఎలా చేశారని ప్రశ్నించారు. ‘కులాల లెక్కలు తేల్చితే విద్యావంతులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారో తేలుతుంది. దేశ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం కూడా తెలుస్తుంది. కుల గణన జరిగితే రిజర్వేషన్లు పెంచాలని బీసీల నుంచి డిమాండ్ వస్తుందన్న ఉద్దేశంతోనే కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆ పని చేయడం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్తోపాటు బీహార్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, తమిళనాడు ముఖ్యమంత్రులు కులాల లెక్కలు తీయాలని కోరారు. అసెంబ్లీల్లో తీర్మానాలు సైతం చేశారు. ప్రజలంతా వారి కుల లెక్కలు తీయాలని కోరుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది. రూపాయి ఖర్చు లేకుండా కుల గణన చేసే అవకాశం ఉన్నా ఎందుకు చేయ డం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. తప్పించుకొనే విధానం అవలంబిస్తే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయబోమని మనమంతా సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి. అన్ని రంగాలను ప్రైవేటీకరిస్తున్న కేంద్రం చివరకు రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలనుకోవడం సిగ్గుచేటు. మొత్తం ప్రైవేటీకరణ చేయడం ద్వారా రిజర్వేషన్లు కూడా పూర్తిగా ఎత్తివేయాలన్న ఆలోచనతో బీజేసీ సర్కారు ఉన్నది. వెంటనే కుల గణన చేపట్టి, పార్లమెంట్లో బిల్లు పెట్టి బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసి బీసీ సబ్ప్లాన్ కూడా అమలు చేయాలి’ అని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
బీసీ జనాభా లెక్కలు బయటకొస్తేనే దోపిడీ చేసేవారికి అడ్డుకట్ట పడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అందుకే లెక్కలు బయటకు రాకుండా ఆ వర్గాలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ‘కేంద్రంలోని బీజేపీ సర్కారు 41 యూనిట్లుగా ఉన్న రక్షణరంగ సంస్థను ఏడుగా చేసి అమ్మేస్తున్నది. డ్రగ్స్ వాడుతున్న వారిని పట్టుకున్నారు. కానీ అమ్మేవారిని పట్టుకోవడంలేదు. దేశంలో స్మగ్లింగ్ అంతా సముద్రం ద్వారానే జరుగుతున్నది. ఆ మార్గాన్నే అదానీకి ఇస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు. అందరూ సమిష్టిగా కేంద్రం మెడలు వంచాలి. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. బీసీల పోరాటానికి జాతీయ స్థాయిలో మా పార్టీ అండగా నిలుస్తుంది’ అని నారాయణ తెలిపారు. దేశంలోని ఓబీసీల్లో 983 కులాలకు ఐదేండ్లుగా ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రయోజనాలు అందటంలేదని సీపీఐ నేత అజీజ్పాషా అన్నారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో చేతగాని పాలన సాగుతున్నదని ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ విమర్శించారు. ఆయన ఏదో చేస్తున్నారన్న భ్రమ నుంచి ప్రజలు బయటకు రావాలని సూచించారు. బీసీల్లోని అన్ని కులాలు ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా బలపడాలని పిలుపునిచ్చారు.
దేశ జనాభాలో 70% బీసీలే ఉన్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం రిజర్వేషన్లు ఇవ్వకపోవడం బాధాకరమని నిరుద్యోగ జేఏసీ నేత నీల వెంకటేశ్ అన్నారు. కులాల లెక్కలు తీయకపోతే బీజేపీ గద్దె దిగిపోవాల్సిందేనని స్పష్టంచేశారు. ‘ఇప్పటివరకు వారి వాటాతోపాటు బీసీలకు వచ్చే వాటాను కూడా అనుభవిస్తున్నారు. ఇక ముందు అది సాగనివ్వం’ అని తేల్చి చెప్పారు. బీసీ కులాలు వేర్వేరుగా కాకుండా.. అన్ని కులాలు ఒకే వేదికపైకి వచ్చి కేంద్రం మెడలు వంచాలని కాంగ్రెస్ నేత వీ హన్మంతరావు సూచించారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, దళిత నాయకులు జేబీ రాజు, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
బీసీ కుల గణన చేపట్టాలని అసెంబ్లీ వేదికగా కేంద్రప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ కోరారని టీఆర్ఎస్ నేత ఎల్ రమణ తెలిపారు. త్వరలోనే సీఎంను మరోసారి కలిసి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతామని చెప్పారు. ‘కుల గణన, రిజర్వేషన్లపై జాతీయ స్థాయిలో రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కేంద్రంపై పోరాటం చేస్తాం. అవసరమైతే ప్రధానమంత్రిని సైతం కలుస్తాం. దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు అర్ధాకలితో అలమటిస్తుంటే అదానీకి రోజుకు వెయ్యి కోట్ల ఆదాయం వస్తున్నట్టు ఇటీవల ప్రసార మాధ్యమాల్లో వచ్చింది. ఈ ఆర్థిక దోపిడీని అరికట్టడంతోపాటు దేశంలోని బీసీలకు న్యాయం జరిగేంతవరకు అందరితో కలిసి ఉద్యమిస్తాం. కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ 2018 ఎన్నికల సమయంలో బీసీ కుల గణన చేపడుతామని, రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ అమలు చేయలేదు. విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో బీసీలకు న్యాయం జరగడంలేదు. ఇక కొట్లాడి సాధించుకుంటాం’ అని రమణ స్పష్టంచేశారు.