TSRTC | హైదరాబాద్ : ఆర్టీసీలోని అన్ని రకాల బస్సుల్లో త్వరలో నగదు రహిత చెల్లింపుతో ప్రయాణం చేసే వెసులుబాటు రానుంది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సహా ఆపై స్థాయి బస్సులన్నింటిలోనూ ఐ-టిమ్స్ పరికరాలను అందుబాటులోకి తేనున్నారు. దీంతో డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటితో ప్రయాణికులు తమ టికెట్ ధరను చెల్లించి, బస్సుల్లో ప్రయాణించొచ్చు.
ఈ మేరకు బండ్లగూడ బస్డిపోను ఆర్టీసీ అధికారులు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. డిపోలోని ఆర్డినరీ, మెట్రో సహా మొత్తం 145 బస్సుల్లో ఐ-టిమ్స్ను వాడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బండ్లగూడ డిపోలో అమలు చేసిన అనంతరం కంటోన్మెంట్ డిపోలో అమలు చేయనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,300 బస్సుల్లో దశల వారీగా ప్రవేశపెట్టేలా కార్యాచరణ రూపొందించారు.