హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర రెవెన్యూ డాక్యుమెంట్ల ద్వారా వేలిముద్రలు సేకరించి వాటి ద్వారా బ్యాంకుల నుంచి నగదు కాజేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను రాష్ట్ర సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అరెస్టయిన ప్రధాన నిందితుల్లో బీహార్లోని కిషన్గంజ్కు చెందిన సీఎస్పీ ఏజెంట్ రంజిత్ షా (ఏ5), బెంగళూరుకు చెందిన సఫత్ ఆలం (ఏ4) ఉన్నారు. నిందితులు సేల్ డీడ్లు, రిజిస్ట్రేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్లలో అప్లోడ్ చేసే పత్రాల్లోని వేలిముద్రలు సేకరించి, వాటిలోని ఆధార్నంబర్ల ఆధారంగా బ్యాంక్ ఖాతాలు, ఫోన్ నంబర్లు సేకరించి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొడుతుంటారు. ఈ కేసులో ఏ1గా ఉన్న సీఎస్పీ ఏజెంట్, బీహార్కు చెందిన అక్మాన్ ఆలంను ఇది వరకే అరెస్టు చేశారు. ఈ వ్యవస్థీకృత నేరంలో ఒక్కొక్కరు ఒక్కో పనిని పంచుకుంటారు. ఒకరు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ విభాగాల నుంచి డాక్యుమెంట్లు సేకరిస్తారు. మరొకరు వాటిలోని ఆధార్ నంబర్లు సేకరిస్తారు. ఇంకొకరు బ్యాంకు ఖాతాలు చెక్ చేస్తారు. మరొకరు ఆ బ్యాంకు ఖాతాలు ఏ ఫోన్ నంబర్కు అనుసంధానమయ్యాయో తెలుసుకుంటారు. రిటైర్డ్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని అప్పటికే సేకరించిన వేలి ముద్రలను సిలికాన్ ముద్రలుగా మార్చేస్తారు. కస్టమర్ సర్వీస్ పాయింట్ల సాయంతో దొంగ వేలిముద్రలను ఉపయోగించి, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్తో బ్యాంకు అకౌంట్ల నుంచి నగదు తస్కరిస్తారు. 2022లో సికింద్రాబాద్కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి అకౌంట్నుంచి నాలుగు దశల్లో రూ.24 వేలు కొల్లగొట్టారు. త్వరతగతిన నిందితులను అరెస్టు చేయడంతో ఓ భారీ మోసాలను ముందుగా నివారించగలిగారు తెలంగాణ పోలీసులు.