చిక్కడపల్లి, ఏప్రిల్ 18: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కల్లు గీత సొసైటీలపై విధించిన నిర్బంధాన్ని ఎత్తివేయాలని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని కమిటీ కార్యాయంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో కమిటీ కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్, వర్కింగ్ చైర్మన్ ఎలికట్టె విజయ్కుమార్గౌడ్తో కలిసి ఆయన మాట్లాడారు. సొసైటీలపై పోలీసులు, రెవెన్యూ, ఎన్సీబీ బృందాలు విచ్చలవిడిగా దాడులు చేసి సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారని, శాంపిళ్ల పేరిట పలువురిని అరెస్టు చేసి జైళ్లలో పెట్టారని, అనేక మందిపై నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేశారని తెలిపారు. కల్లుగీత వృత్తిని పర్యవేక్షించే ఆబ్కారీ శాఖకు సబంధం లేకుండానే దాడులు చేస్తున్నారని తెలిపారు. వెంటనే గీత కార్మికులపై పెట్టిన అన్ని కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. గౌడల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. చెట్ల పైనుంచి పడి మృతిచెందిన గీత కార్మికులకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెట్టాలని, గౌడ కులస్థులకు వైన్షాపుల్లో 25 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 40 లక్షల జనాభా ఉన్న గౌడలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కేటాయించకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా ఒక సీటు కేటాయించాలని కోరారు. సమావేశంలో తెలంగాణ గౌడ సంఘం ఉపాధ్యక్షుడు పోతగాని ఐలన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.