హైదరాబాద్, నవంబరు 21 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపునకు ప్రోత్సహించిన బీజేపీ దూతలపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ తరఫున బ్రోకర్లుగా వ్యవహరించిన దొంగస్వామీజీల భాగోతాన్ని తెలంగాణ పోలీసులు బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిందితులు తాము ఏయే రాష్ర్టాల్లో ప్రభుత్వాలను పడగొట్టిందీ, పడగొట్టేందుకు ప్రయత్నించిందీ తమంతట తామే వెల్లడించిన విషయాలు ఆడియో, వీడియోల్లో రికార్డయ్యాయి.
ఈ సమాచారాన్ని కొన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు సీరియస్గా తీసుకున్నట్టు సమాచారం. ఆరు లేదా ఏడు రాష్ర్టాలలో కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్టు తెలిసింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల ద్వారా బీజేపీ ముఠా కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో ప్రభుత్వాలను పడగొట్టిన సంగతి తెలిసిందే. ఆయా రాష్ర్టాల్లో బాధిత పార్టీలు, ప్రజాస్వామ్య ప్రేమికులు బీజేపీపై న్యాయపోరాటానికి సిద్ధమైనట్టు తెలిసింది. దీనికి సంబంధించి వారు ఇప్పటికే న్యాయనిపుణులను సంప్రదించారని చెప్తున్నారు. వీలైతే పోలీసు కేసు పెట్టాలని లేదా న్యాయస్థానాలను ఆశ్రయించాలని యోచిస్తున్నారు. ఢిల్లీలో కూడా ఆప్ ప్రభుత్వంపై జరిగిన కుట్ర విషయంలో అక్కడి ప్రభుత్వం సీరియస్గానే స్పందించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
ఢిల్లీలో పోలీసు వ్యవస్థ కేంద్రం చేతిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు సమాచారం. కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు కూడా ఈ అంశంపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. తెలంగాణలో నమోదైన కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతి తమిళనాడుకు చెందిన బీజేపీ నేత అన్నామలైతో జరిపిన సంభాషణల రికార్డు అక్కడి ప్రభుత్వానికి చేరింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించనున్నది.
కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని తాము ఎలా పడగొట్టిందీ రామచంద్రభారతి, సింహయాజి బృందం పూసగుచ్చినట్టు వివరించింది. ఢిల్లీ ప్రభుత్వాన్ని ఏ విధంగా కూల్చాలనుకున్నదీ, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేను శివసేన నుంచి ఎలా చీల్చింది కూడా చెప్పారు. ఇవన్నీ ఆడియో, వీడియోలలో రికార్డయ్యాయి. ఈ దొంగ స్వామీజీలకు తెరవెనుక నుంచి బీజేపీ నేతలు బీఎల్ సంతోష్, అమిత్షా, దత్తాత్రేయ హొసబలె, తుషార్ తదితరులు ఎలా సహకరించినదీ వెల్లడించారు. వీటి ఆధారంగా వారందరిపై రాజద్రోహం కేసులు పెట్టాలని ఒకటిరెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
సీఆర్పీసీ చట్టాన్ని ఎంత సమర్థంగా ఉపయోగించుకోవచ్చో తెలంగాణాను చూసి నేర్చుకుంటున్నట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ రాష్ట్ర నేత చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారం కోల్పోయి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని, ఎలాగైనా కేసులు నమోదు చేయించాలని నిర్ణయించినట్టు సమాచారం. దొంగస్వాముల భరతం పట్టాలని, లేకపోతే దేశవ్యాప్తంగా వారు మరింత పేట్రేగే ప్రమాదం ఉన్నదని చెప్తున్నారు.