మంచిర్యాల, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా బాల్కసుమన్ సహా బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులో.. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేరును సైతం పోలీసులు చేర్చారు. ఈనెల 16న తొలిరోజు క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడటంతో.. మరుసటి రోజు ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని పార్టీ అధిష్ఠా నం నియమించింది. ఈ మేరకు 17న క్యాతనపల్లికి వచ్చిన కోవ లక్ష్మి.. గెలిచిన బీఆర్ఎస్- సీపీఐ కౌన్సిలర్లను తీసుకొని, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్తోపాటు కౌన్సిల్ హాల్కు బయల్దేరారు. క్యాతనపల్లి ైఫ్లైఓవర్ సమీపంలో బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లను పోలీసులు అడ్డుకున్న సమయంలో ఎమ్మెల్యే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపా రు.
ఈ క్రమంలో జరిగిన గొడవలో కోవ లక్ష్మి ఓ మహిళా కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. కోవ లక్ష్మితోపాటు బాల్క సుమన్ వ్యక్తిగత సహాయకుడు మహేందర్ను సైతం ఆ ఘటనలో ఏ13గా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు, మరో ఇద్దరు ఏ10 రామిడి కొమురయ్య, ఏ11 కుర్మ దినేశ్ను సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఆ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాం డ్ రిపోర్ట్లో ఏ12గా కోవ లక్ష్మి, ఏ13గా మహేందర్ను చూపించారు. కోవ లక్ష్మి పరారీలో ఉన్నట్టు చూపించడం గమనార్హం.