హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయని, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ దానిని బీజేపీ నడిపిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కేటీఆర్పై కేసు నమోదు చేయడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని మరోమారు స్పష్టమైందని పేర్కొన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి బీజేపీ పెద్దలను కలిసిన తర్వాతే కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసిందని ఆరోపించారు. ‘తొలుత సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారు. ఆ తర్వాత గవర్నర్ కేసు నమోదుకు అనుమతి ఇచ్చారు. అనంతరం ఏసీబీ కేసు నమోదు చేసిన మరునాడే ఈడీ కేసు నమోదు చేసింది. దీనిని బట్టి చూస్తే ఆ రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నట్టు స్పష్టమవుతున్నది’ అని పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆమె మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండకూడదన్న లక్ష్యంతో కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ వంటి బలమైన నాయకులను దెబ్బకొట్టాలని ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, కేసీఆర్ను దెబ్బకొట్టడం ఆ పార్టీలకు సాధ్యం కాదని తేల్చిచెప్పారు. కక్షసాధింపులో భాగంగానే కేటీఆర్పై ఏసీబీ, ఈడీ కేసు నమోదు చేశాయని, ప్రజల పక్షాన పోరాడుతున్నందుకే టార్గెట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ర్టాన్ని ప్రపంచబ్యాంకుకు తాకట్టు
సీఎం రేవంత్రెడ్డి తెలంగాణను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెడుతున్నా కమ్యునిస్టులు మౌనంగా ఎందుకు ఉంటున్నారని కవిత ప్రశ్నించారు. ప్రపంచ బ్యాంకు చీకటి చరిత్ర నేపథ్యంలో పదేండ్ల పాటు ఆ బ్యాంకును కేసీఆర్ తెలంగాణకు దూరంగా ఉంచారని పేరొన్నారు. భూభారతితో భూభద్రత ఉండదని విమర్శించారు. భూభారతి చట్టం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను నాశనం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూభారతి చట్టాన్ని తిరోగమన చర్యగా అభివర్ణించారు. ధరణిపై విషప్రచారం చేశారని, ప్రజలు తిరిగి ధరణి వ్యవస్థ కావాలని ఉద్యమించే పరిస్థితి వస్తుందని తెలిపారు.
నిధులున్నా పైసా పనిచేయని సర్కార్
కేంద్ర ప్రభుత్వం నుంచి పుషలంగా నిధులు వస్తున్నాయని ప్రభుత్వమే చెప్తున్నదని కానీ, ప్రజలకు పైసా పనులు కావడం లేదని కవిత విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ 2500 ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అమలు చేయడం లేదని, తద్వారా ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ. 30వేలు బాకీ పడిందని వివరించారు. మహిళలకు కల్పించిన ఉచిత బస్సును తామూ ఆహ్వానిస్తున్నామని, అదే సమయంలో బస్సుల సంఖ్యను తగ్గించారని ఆరోపించారు. బస్సుల సంఖ్య తగ్గడం ద్వారా ప్రయాణికులందరికీ ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు.
పదవుల కోసం రాలేదు
తాము పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయడంలో వెనక్కి తగ్గేదే లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ తమ జీవితంలో భాగమని పేర్కొన్నారు. ‘మేం పదవుల కోసం వచ్చినవాళ్లం కాదు. ప్రజల నుంచి వచ్చినవాళ్లం’ అని స్పష్టం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ తయారు చేసిన సైనికులమని పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో అనేక విధాలుగా తట్టుకొని నిలబడ్డామని చెప్పారు.
జగిత్యాలకే పరిమితం కాను
జగిత్యాల నుంచి పోటీ చేస్తారా? అన్న విలేకరుల ప్రశ్నకు కవిత స్పందిస్తూ తాను జగిత్యాలకే పరిమితం కాబోనని, రాష్ట్రవ్యాప్తంగా ఏ సమస్య వచ్చినా వెళ్తానని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని వెల్లడించారు. తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ పార్టీ వేర్వేరు కాదని కలిసే పనిచేస్తాయని తెలిపారు.
ప్రజల దృష్టిని మళ్లించేందుకే అల్లు అర్జున్ అంశం
రాష్ట్రంలో ప్రతీకార పాలన సాగుతున్నదని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలపై దాడి చేయడాన్ని రేవంత్రెడ్డి పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే అల్లు అర్జున్ వ్యవహారాన్ని ప్రభుత్వం తెరమీదికి తెచ్చిందని పేర్కొన్నారు. నిజానికి రాష్ట్రంలో 10 శాతం కమీషన్ ప్రభుత్వం నడుస్తుందని ఆరోపించారు. అందరి కోసం కాకుండా కొందరి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని, ప్రభుత్వ ప్రాధాన్యతలు పెద్ద వాళ్లపైనే ఉన్నాయని విమర్శించారు. మేఘా కృష్ణారెడ్డి వంటి వారి కంపెనీలకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తున్న రేవంత్రెడ్డి సరార్ పేదలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకు మాత్రం నిధులు విడుదల చేయడం లేదని ఎండగట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విషాహారం తిని గురుకులాల్లో 57 మంది పిల్లలు చనిపోయారని, వారి కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కాకపోవడం వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు.
తెలంగాణ తల్లి కోసం ఊరూరా ఉద్యమమే
తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసే కుట్ర చేస్తున్నదని, ఆ కుట్రలను అడ్డుకుంటామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. గ్రామగ్రామాన ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా తట్టెడుమట్టి తీయలేదని విమర్శించారు. ఇప్పటికే నడుస్తున్న ప్రాజెక్టులను కూడా పూర్తిచేయని పరిస్థితి కనిపిస్తున్నదని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా కొద్దిపాటి నిధులు వెచ్చించి మూడు నాలుగు కిలోమీటర్ల మేర పనులు చేపడితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఇప్పటికే నీళ్లు అందేవని వివరించారు. కానీ, ప్రాజెక్టును పూర్తి చేయడానికి మాత్రం ప్రభుత్వానికి మనసు రావడంలేదని మండిపడ్డారు. పరిమిత నిధులు వెచ్చించడం ద్వారా పూర్తయ్యే ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం విస్మరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.