Drinking Water | మంచాల, ఏప్రిల్ 10: తాగునీటి కోసం జరిగిన గొడవ గ్రామస్థుడిపై కేసుకు కారణమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్చెర్వుతండా(పీసీతండా)లో జరిగిందీ ఘటన. స్థానికుల వివరాల ప్రకారం.. నెల రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోవడంతో తండాకు చెందిన సపావట్ రాజునాయక్ విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. రెండ్రోజుల క్రితం మిషన్ భగీరథ ఏఈ స్రవంతి, స్థానిక పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్ తండాలో తాగునీటి సమస్య పరిశీలనకు వచ్చారు.
ఈ సందర్భంగా స్థానికులు వారితో తమ కష్టాలు మొరపెట్టుకున్నారు. నీళ్లు రాకపోవడంతో డబ్బులు ఖర్చుచేసి ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నామని చెప్పారు. ఈ క్రమం లో అధికారులకు ఫిర్యాదుచేసిన రాజు, స్థానిక వాటర్మన్ శ్రీనునాయక్ మధ్య వాగ్వాదం జరిగింది. దీనిని తీవ్రంగా తీసుకున్న శ్రీనునాయక్ రాజుపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తనపై కేసు నమోదుకావడంతో రాజు ఆవేదన వ్యక్తంచేశాడు. నీళ్లు అడిగితే కేసు పెట్టడం ఏమిటని వాపోయాడు.
పీసీతండాలో నెలరోజులుగా నీటి సమస్య ఉన్నది. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మిషన్ భగీరథ అధికారులు రోజూ తండాకు వచ్చి నీటి సరఫరాపై ఆరా తీసి సంతకాలు తీసుకునేవారు. ఇప్పుడు వారు అసలు రావడమే లేదు. తండాకు రాకుండా నీటిని సరఫరా చేస్తున్నట్టు వారే సంతకాలు పెట్టేస్తున్నారు.
-రాజునాయక్, మాజీ సర్పంచ్