పరకాల, మే 22: రచ్చబండ పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘రచ్చబండ’ ప్రారంభోత్సవం సందర్భంగా జయశంకర్ సార్ స్వగ్రామమైన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో చేపట్టిన కార్యక్రమం ప్రజా సమస్యలను తెలుసుకొనేలా లేదని, అక్కడ ఆయన వ్యవహరించిన తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. రేవంత్ భోజనం చేసిన ఇంట్లోని ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఆయనకు ఆహ్వానం పలికిన యాదవులు బహుమానంగా ఇచ్చిన గొర్రె పిల్ల కేసీఆర్ ఇచ్చిందే. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పాలన పారదర్శకంగా సాగుతూ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతుండటమే దీనికి నిదర్శనం.
గొర్రె ఇచ్చిన దూడయ్య ఇంటికి మూడు పథకాలు
అక్కంపేటకు వచ్చిన సందర్భంగా రేవంత్రెడ్డికి గోపు దూడ య్య గొర్రెను బహూకరించాడు. ఈయన నాటి నుంచి కాంగ్రెస్ మద్దతుదారుడే. తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా క్షేత్ర స్థాయిలో అందుతున్నాయనేందుకు దూడయ్య కుటుంబమే నిదర్శనం. ఈయన యాదవ కులానికి చెందిన వ్యక్తి కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుడు. ఆయన కుటుంబానికి రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. రైతుబంధు పథకం కింద ఎకరాకు ఐదు వేల చొప్పున రెండు విడుతలుగా ఏటా రూ.20 వేలు వారి ఖాతాలో జమ అవుతున్నాయి. అంతేగాక దూడయ్య తల్లి ఓదెక్కకు ప్రతి నెలా రూ. 2,016 ఆసరా పింఛన్ వస్తున్నది. కేసీఆర్ ఇచ్చిన గొర్లను కాస్తూ వాటి సంఖ్యను పెంచుకొన్న దూడయ్య.. రైతుబంధుతో పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసుకొంటూ ఆర్థికాభివృద్ధి సాధించి సొంత ఇంటిని నిర్మించుకొన్నాడు.
జాన్ కుటుంబానికి తెలంగాణ సర్కారు అండ
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా అక్కంపేటలో టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి భోజనం చేసిన సిలివేరు జాన్ కుటుంబాన్ని ఉమ్మడి పాలకులు ఛిన్నాభిన్నం చేస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఉమ్మడి రాష్ట్రంలో జాన్ తండ్రి ప్రకాశం గ్రామంలో సఫాయి కార్మికుడిగా ఐదేండ్లు పనిచేశాడు. అనారోగ్యం బారిన పడిన ఆయన్ను అప్పటి పాలకులు విధుల నుంచి తొలగించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జాన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. జాన్ పెద్ద కూతురు ఝాన్సీకి 2015లో వివాహం కాగా, రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం కింద ఆర్థికసాయాన్ని అందించింది. కాగా రెండో కూతురు నాగమణికి 2019లో వివాహం కాగా సరైన వయస్సు లేకపోవడంతో ఆ పథకానికి అర్హత పొందలేదు. అయితే రేవంత్రెడ్డి సందర్శించిన బొల్లెపల్లి ప్రభుదాస్-రాణి కుటుంబానికి అర్హత లేకపోవడంతో ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదు.