మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 8 : ఆర్థిక ఇబ్బందులతో ఓలా డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం జరిగింది. మంచిర్యాల పట్టణ ఎస్ఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నూర్ మండలం సుందరసాలకు చెందిన బొమ్మ రాంరెడ్డి- రమ దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. రాంరెడ్డి పదేండ్ల కిత్రం మృతి చెందగా రమ కష్టపడి పిల్లలను చదివించింది. కొడుకు హరికృష ్ణ(28) బీటెక్ పూర్తి చేశాడు. కుటుంబానికి భారం కావద్దని 4 సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వచ్చి ఓలా, ఉబెర్ కంపెనీలో కారు డ్రైవర్గా పనిచేశాడు. తర్వాత ఓ కారు కొని అదే కంపనీలో రెంట్కు పెట్టి జీవనాన్ని సాగించేవాడు. మరో వైపు ప్రభుత్వ ఉద్యోగం కోసం సైతం కష్టపడుతుండేవాడు.
ఉద్యోగం రాకపోవడం.. ఓలాలో సరైన కార్ రెంట్లు లేక నష్టపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నెల 6న సుందరశాలకు వచ్చిన హరికృష్ణ ఈ నెల 7న తిరిగి హైదరాబాద్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి మంచిర్యాలకు వచ్చి ఓ లాడ్జిలో ఉన్నాడు. తీవ్ర మనస్తాపానికి గురైన హరికృష్ణ అదేరోజు రాత్రి పురుగులమందు తాగి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబసభ్యులు వచ్చి లాడ్జి సిబ్బంది సాయంతో హరికృష్ణను దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.