హైదరాబాద్ సిటీబ్యూరో/కీసర, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): బంధువుల పెండ్లికి వెళ్లి తిరిగి వస్తున్న భార్యను ఇంటికి తీసుకెళ్లేందుకు మేడ్చల్ కండ్లకోయ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి రోడ్డుపై ఎదురుచూస్తున్నాడో భర్త. వచ్చేస్తామని చెప్పిన సమయం గడిచినా ఆమె రాలేదు. ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఆయనలో కొంచెం ఆందోళన. అరగంట తర్వాత మళ్లీ ఫోన్ చేయగా.. ‘ఇక్కడ యాక్సిడెంట్ అయింది. అందరికీ తీవ్రగాయాలయ్యాయి’ అని ఫోనెత్తిన ఓ వాహనదారుడు చెప్పగానే ఒక్కసారిగా గుండె ఆగినంత పనయింది. అక్కడికి చేరుకుని విగతజీవిగా పడిఉన్న భార్యను చూసి నోటమాట రాలేదు. కన్నీటి చుక్క ఆగలేదు. ఇదీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద కనిపించిన హృదయ విదారక ఘటన. కారు డివైడర్ను ఢీకొని హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేవీఎం ప్రసాద్ భార్య, ఆయన సోదరుడి కొడుకు, కోడలు మృతిచెందారు.
కీసర ఇన్స్పెక్టర్ నరేందర్గౌడ్ వివరాల ప్రకారం.. ఏసీపీ ప్రసాద్ భార్య శంకరమ్మ (48), హైదరాబాద్ మూసాపేటకు చెందిన అతని సోదరుడి కొడుకు, కోడలు కారంపూడి బాలకృష్ణ(48), రేణుక (40), కుమారుడు భాస్కర్ కారులో ఈ నెల 24న ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాలలో పెండ్లి వేడుక కోసం వెళ్లారు. రాత్రి తిరిగి ఇంటికి బయలుదేరారు. చీరాల నుంచి కారు నడిపిన భాస్కర్.. పెద్దఅంబర్పేట ఓఆర్ఆర్ దగ్గరకు రాగానే తనకు నిద్ర వస్తుందని తండ్రి బాలకృష్ణకు డ్రైవింగ్ సీటు ఇచ్చి పక్కకు మారాడు. కీసర ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గరకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. కారు వెనుక సీట్లో కూర్చున్న శంకరమ్మ, రేణుక అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ బాలకృష్ణను స్థానిక దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్యను ఇంటికి తీసుకెళ్దామని వస్తే.. ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లాల్సి వస్తున్నదని ప్రసాద్ కన్నీరుమున్నీరయ్యారు. కాగా, భాస్కర్ సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల స్వల్పగాయాలతో బయటపడ్డాడని పోలీసులు భావిస్తున్నారు.