హైదరాబాద్: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), అస్సాం రైఫిల్స్లోని ఎస్ఎస్ఎఫ్, రైఫిల్ మ్యాన్ (జనరల్ డ్యూటీ)కి చెందిన కంప్యూటర్ బేస్డ్ పరీక్షను ఈనెల 20 నుంచి మార్చి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షను తొలిసారిగా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు. దక్షిణాది నుంచి ఈ పరీక్షలు రాసేందుకు 3,15,599 మంది అర్హత సాధించినట్లు సీఏపీఎఫ్ వర్గాలు తెలిపాయి.
దక్షిణాది రాష్ర్టాల్లో 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరంలో పరీక్షలు కొనసాగనున్నాయి. రోజుకు నాలుగు షిప్టుల వారీగా 13 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ-అడ్మిట్కార్డు కోసం sscsr.gov.inలో వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు కోరారు. మరిన్ని వివరాలు అభ్యర్థులకు ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేస్తామని వివరించారు. మరిన్ని వివరాలకు 044-28251139, 9445195946 నంబర్లను సంప్రదించాలని కోరారు.