హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): గంజాయి ముఠాలు కొత్త ట్రెండ్స్ సృష్టిస్తున్నాయి. గతంలో తెలిసిన మధ్యవర్తుల ద్వారా గుట్టుగా గంజాయి సరఫరా చేసిన గ్యాంగులు ఇప్పుడు ఆన్లైన్లోనే ‘దుకాణాలు’ తెరుస్తున్నాయి. ఇన్స్ట్రాగ్రాం గ్రూపుల ద్వారా వలవేసి, ఫైన్ క్వాలిటీ పొడి గంజాయిని అందిస్తున్నాయి. మత్తులో జోగేందుకు ఏకంగా గంజాయి కేఫ్లు సైతం పెట్టేస్తున్నాయి. ఇదంతా నగరంలో అత్యంత రద్దీగా ఉండే అమీర్పేట ఏరియాలో కావడం గమనార్హం. గంజాయి మత్తులో జోగుతున్నవారిలో ప్రఖ్యాత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు, పలువురు ధనవంతుల పిల్లలు ఉన్నట్టు సమాచారం. ఎక్సైజ్శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాలతో స్టేట్ టాస్క్ఫోర్స్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పవన్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ బృందం ఇన్స్పెక్టర్ బీ ప్రవీణ్కుమార్ నేతృత్వంలో ఈ నెల 14న అమీర్పేట, లా కాలేజీ రోడ్డు, ఎల్లారెడ్డిగూడలోని ఓ అపార్ట్మెంట్పై దాడులు నిర్వహించింది. అక్కడ ఒక ఫ్లాట్లో గంజాయి కేఫ్ నిర్వహిస్తున్నట్టు ఆధారాలు లభించాయి. ఘటన స్థలంలో ఐదు కిలోల పొడి గంజాయితోపాటు గంజాయి సరఫరా చేస్తున్న జీ వరుణ్చందర్, జీ చంద్రశేఖర్, వీ కృష్ణప్రసాద్, వై రమేశ్లను అరెస్టు చేశారు. వీరికి గంజాయి సరఫరా చేస్తున్న కీలక వ్యక్తి ఆదిత్యను స్టేట్ టాస్క్ఫోర్స్ బృందం గురువారం ఉదయం అమీర్పేట సమీపంలోనే అరెస్టు చేసింది. అతడు ఏపీలోని విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి గంజాయిపొడిని తెప్పిస్తున్నట్టు ఎక్సైజ్శాఖ అధికారుల దర్యాప్తులో తేలింది. ఒక్కో పొట్లం రూ.వెయ్యికి కస్టమర్లకు విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు.