హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): అల్జీమర్స్, లంగ్స్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్లాంటి మహమ్మారుల నుంచి విముక్తి కల్పించేందుకు త్వరలో ప్రపంచానికి క్యూబా వ్యాక్సిన్ అందించబోతున్నదని, దీని తయారీ తుదిదశలో ఉన్నదని క్యూబా విప్లవవీరుడు చేగువేరా కుమార్తె, ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ అలైదా గువేరా వెల్లడించారు. క్యూబా దేశ కమ్యూనిస్టు పితామహుడు ఫిడెల్ కాస్ట్రో చొరవ వల్ల విద్యాపరంగా ఎంతో పురోగతి సాధించిందని, తమ దేశ డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా సుమారు 56 దేశాల్లో సేవలు అందిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆమెతో సోమవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పలు అంశాలపై చర్చించారు. అమెరికా ఆర్థికంగా ఎన్ని ఆంక్షలు విధించినా మొకవోని ధైర్యంతో క్యూబా ముందుకు సాగుతున్నదని.. విద్య, వైద్య రంగాల్లో గణనీయ ప్రగతి సాధించిందని అలైదా పేర్కొన్నారు. బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ సోషలిస్టు దేశాలు ప్రజల కోసం నిలబడుతాయని, క్యూబా ప్రపంచ మానవాళికి అండగా నిలిచేందుకు క్యాన్సర్ వ్యాక్సిన్ను అందించబోతున్నదని కొనియాడారు. పెట్టుబడిదారి దేశాలు ప్రజల అవసరాలతో వ్యాపారం చేస్తాయని, కానీ సోషలిస్టు దేశం క్యూబా మాత్రం ప్రజల కోసం నిలబడుతున్నదని ప్రశంసించారు. కరోనా సమయంలో వైద్యపరంగా అనేక దేశాలను ఆదుకొన్నదని గుర్తుచేశారు. క్యాన్సర్తోపాటు ప్రమాదకర వ్యాధులను సమూలంగా తుడిచి పెట్టేందుకు క్యూబా కంకణం కట్టుకొన్నదని, అది గొప్ప విషయమని తెలిపారు.