హైదరాబాద్; సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల మధ్య ఊరేగింపుగా మాడవీధిలో ఉత్సవ ఏర్పాట్లను చూస్తూ తిరిగి ఆలయానికి చేరుకున్న తరువాత యాగశాలలో శాస్ర్తోక్త కార్యక్రమాలను నిర్వహించారు. లలాట, బహు, సప్త పునీత ప్రదేశంలో భూమిపూజ జరిపారు. తొమ్మిది కుండల్లో శాలి, వ్రహి, యువ, ముద్గ, ప్రియంగు వంటి నవధాన్యాలను ఆ మట్టిలో కలిపి మొలకెత్తించే పనికి శ్రీకారంచుట్టారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ బీజవాపం కార్యక్రమంతో అంకురార్పణ కార్యక్రమం సమాప్తమైంది. మంగళవారం సాయంత్రం జరిగే ధ్వజరోహణంతో గోవిందుడి బ్రహ్మోత్సవాల సంబురం మొదలుకానున్నది. బ్రహ్మోత్సవాల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. కేవలం సర్వదర్శనాలను మాత్రమే అమలుచేయనున్నది.